Munugode Posters Politics: మునుగోడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ గెలుపుకోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శ్రమిస్తున్నాయి. ఈమేరకు ఉప ఎన్నికల సమరంలో రోజుకో రచ్చ రాజుకుంటోంది. ప్రస్తుతం జరుగుతున్న పోస్టర్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. మొన్న కాంట్రాక్ట్ పే పోస్టర్ల కాంట్రవర్సీ ముగియకముందే.. మరోసారి అదే సీన్ రిపీటైంది. ఈసారి చౌటుప్పల్లో పోస్టర్లు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. మునుగోడు ప్రజలారా.. మేం మోసపోయాం.. మీరు మోసపోవద్దు.. ఇట్లు దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు అంటూ చౌటుప్పల్లో పోస్టర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే పోస్టర్లు వెలువడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

చండూరులో..
మనుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరులోనూ ఇలాంటి పోస్టర్లే వెలిశాయి.. ‘షా’ ప్రొడక్షన్ సమర్పించు.. ’18 వేల కోట్లు’ నేడే విడుదల.. ‘దర్శకత్వం కోవర్ట్రెడ్డి’.. సత్యనారాయణ 70 ఎం.ఎం అంటూ సినిమా పోస్టర్ మాదిరిగా చండూరులో పోస్టర్లు వెలిశాయి. వరుస ఘటనలతో అయోమయంలో పడిపోయారు బీజేపీ నేతలు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి పోస్టర్లతో రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసినా, మునుగోడు ప్రజలు తమవైపే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో లిక్కపే పోస్టర్లు..
టీఆర్ఎస్ నాయకులే పోస్టర్ల రాజకీయం చేస్తున్నట్లు బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు కషాయ నేతలు కూడా పోస్టర్ల రాజకీయానికి శ్రీకారం చుట్టారు. అయితే కోర్టు స్టే నేపథ్యంలో బహిరంగంగా వేయకుండా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. కవిత పేరుతో లిక్కర్ పే అంటూ.. ఫోనపేను పోలిన పోస్టర్లను వైరల్ చేస్తున్నారు. దీనిపై కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బీజేపీ అనుకూలులు రాజగోపాల్రెడ్డి ఓపెన్ టెండర్లు కాంట్రాక్టు దక్కించుకున్నాడని, కవిత ఎలా లిక్కర్ కుంభకోణంలో చిక్కుకుందో.. ఎవరి కోసం లిక్కర్ స్కాంకు తెరలేపిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

భారీగా నామినేషన్లు..
పోస్టర్ల రాజకీయం ఇలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. దాదాపు 130 మంది పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అక్టోబర్ 17 ఉపసంహరణకు చివరి తేదీ. ఆ తర్వాత ఎంత మంది బరిలో ఉంటారన్న దానిపై క్లారిటీ వస్తుంది. చర్లగూడం రిజర్వాయర్ భూనిర్వాసితులు తమ నిరసన తెలిపేందుకు ఉపఎన్నికను అస్త్రంగా ఎంచుకున్నారు. పదుల సంఖ్యలో నామినేషన్ వేశారు. ఇక నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తున్నాయి.