రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎట్టకేలకు కృష్ణాబోర్డు నివేదిక సిద్ధం చేస్తోంది. ఈ మధ్యనే ప్రాజెక్టు నిర్మిత ప్రాంతాన్ని కమిటీ పరిశీలించింది. అయితే.. తెలంగాణకు చెందిన అధికారులు ఎవరూ ఈ కమిటీలో ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ షరతు విధించింది. దీంతో.. ఏపీ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకున్న నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్.. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు లేకుండా అక్కడికి వెళ్లాలని సూచించింది.
ఇంత వరకూ బాగానే ఉంది. కమిటీ రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించింది. అయితే.. ఇక్కడే ట్విస్టు చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉన్నతాధికారులు ఈ కమిటీని కలిశారు. అంతేకాదు.. రాయలసీమ ఎత్తిపోతల దగ్గర తమదైన వివరణ కూడా ఇచ్చారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. మరి, ఇంత జరుగుతుంటే.. తెలంగాణ చూస్తూ ఎందుకు ఊరుకుటుంది?
తెలంగాణ అధికారులు లేకుండా ప్రాజెక్టును సందర్శించినప్పుడు.. ఆంధ్రప్రదేశ్ అధికారులను మాత్రం ఎందుకు భాగం చేశారని సూటిగా ప్రశ్నించింది. కాబట్టి.. కృష్ణాబోర్డు ఇచ్చే నివేదికలోని నిస్పాక్షికతపై అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో.. ఇప్పుడు అందరి దృష్టీ కృష్ణాబోర్డు ఇచ్చే నివేదికపైనే నెలకొంది. అందులో ఏముంది అన్నది తెలిసిన తర్వాత సర్కారు తమదైన రీతిలో స్పందించే అవకాశం కనిపిస్తోంది.
ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సర్కారు ఆరోపిస్తున్నట్టుగా రిపోర్టు లేకపోతే.. మరిన్ని ఘాటైన ఆరోపణలు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ అధికారులు కలవడం వల్లే రిపోర్టు తారుమారైందనే ఆరోపణలు చేసే ఛాన్స్ కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో.. తమకు అనుకూలంగా లేకపోతే.. ఏపీ కూడా వెనక్కు తగ్గే సూచనలు కనిపించట్లేదు. కాబట్టి.. ఈ నీటి పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.