Southwest Monsoon 2024: ఊపిరి పీల్చుకోండి.. జనాలకు ఉపశమనం ఇచ్చే వార్త

లానినో ప్రభావంతో ఈసారి ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అందకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని పేర్కొంది.

Written By: Raj Shekar, Updated On : May 28, 2024 7:59 am

Southwest Monsoon 2024

Follow us on

Southwest Monsoon 2024: భారత వాతావరణ శాఖ (IMD) దేశ ప్రజలంతా ఊపిరి పీల్చుకునే శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు మరో ఐదు రోజుల్లో కేరళను తాకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రకటించింది. కేరళను తాకిన తర్వాత సకాలంలో దేశమంతటా విస్తరిస్తాయని తెలిపింది. ఈసారి దేశంలో సాధారణం, సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు పడతాయని పేర్కొంది.

ఆగస్టు, సెప్టెంబర్‌లో అధిక వర్షాలు..
లానినో ప్రభావంతో ఈసారి ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అందకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని పేర్కొంది. భారత వాతావరణ శాఖ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయంలో గత 150 ఏళ్లుగా మారుతూనే ఉంది. మొదటిసారి 1918లో మే 11నే రుతుపవనాలు కేరళను తాకాయి. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్‌ 18న భారత దేశంలోకి ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్‌ 8న, 2022లో మే 29న, 2021లో జూన్‌ 3న, 2020లో జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి.

5 రోజులు వర్షాలు..
ఇదిలా ఉంటే.. రానున్న ఐదు రోజులు పశ్చిమ తీరంతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణం చాలా వరకు చల్లబడుతుందని పేర్కొంది.

ఉత్తరాదిన వేడి…
ఇక ఉత్తర భారత దేశంలోని రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో వేడి తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఈ నెలాఖరు వరకు ఈ రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.