
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్త నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర భారతంలో మాత్రం నిరసనలు భగ్గుమంటున్నాయి. ఆ బిల్లులతో రైతులకు నష్టాలే తప్ప.. లాభాలు ఏముండవు అంటూ నిలదీస్తున్నారు. రాష్ట్రాల నుంచి ఇప్పుడు దేశ రాజధానికి అంటుకున్నాయి అగ్రి బిల్లుల సెగలు.
పంజాబ్, హర్యానాతోపాటు రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్లోనూ రైతులు ఆందోళన నిర్వహించారు. తాజాగా ఈ నిరసనల సెగ దేశ రాజధాని ఢిల్లీని తాకింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని పెద్ద ఎత్తున రైతులు ఇండియా గేట్ వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా వ్యవసాయ బిల్లును నిరసిస్తూ ట్రాక్టర్ను దహనం చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను సైతం తగలబెట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Also Read : చైనాకు షాక్: సరిహద్దుల్లో నిశ్శబ్ధ మిసైల్ దించిన భారత్
పంజాబ్ ముద్దబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ జయంతి నేడు. ఇదే రోజున పంజాబ్ రైతులు రోడ్డు బాట పట్టాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. పంజాబ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వరంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకున్నా ఇండియా గేట్ ముందు కూర్చుని ధర్నా నిర్వహించారు. మరోవైపు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్సర్– ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు.
ఓ వైపు దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నా.. రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ బిల్లులు మాత్రం చట్టరూపం దాల్చాయి. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. మరోవైపు రైతుల ఉద్యమానికి మద్దతు తెలపాని కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రధాన పార్టీలను కోరింది.
ఈ వ్యవసాయ బిల్లులు వ్యవసాయ రంగం, రైతుల పాలిట కేన్సర్లా మారబోతున్నాయని.. అందరూ వ్యతిరేకించాలని కోరింది. కాగా.. ఈ బిల్లుల విషయమై ఇప్పటికే అకాలీదళ్ ఎన్టీయే నుంచి వైదొలగగా.. జేడీయూ, ఎల్జేపీ, జేజేపీలను కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు ఆ పార్టీలకు ఓ లేఖ కూడా రాసింది. బిల్లులను నిరసిస్తూ సోమవారం కర్ణాటక బంద్కూ పిలుపునిచ్చాయి.
Also Read : రాహులే ప్రధాని.. దీపిక ప్రశంసలు.. అందుకే ఈ కష్టాలా?