‘ఒక బైక్ పైనుంచి పడిపోయిన వ్యక్తికి గాయం ఎక్కడైందో అక్కడే మందు రాయాలి. కానీ.. మొత్తం కాలే తీసేస్తా అంటే ఎట్ల..?’ ప్రస్తుతం ఇలానే ఉంది మన తెలంగాణ రాష్ట్ర సర్కార్ వైఖరి. దేశంలోనే అతిపురాతన ఆస్పత్రుల్లో ఒకటి.. వంద ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి భవనం కాలగర్భంలో కలిసిపోబోతోంది. బిల్డింగ్కు లీకేజీలు వస్తే రిపేర్లు చేయించకుండా.. మొత్తం నేలమట్టం చేసి కొత్తవి నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెబుతుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
Also Read: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కాలదన్నుతున్నారు
చివరి నిజాం పాలకుడు ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిన అతని పేరు మీదనే ఈ కట్టడం ప్రసిద్ధికెక్కింది. ఎంతో ఘన కీర్తి.. ఎంతో చరిత్ర.. ఎందరో ప్రాణాలు కాపాడిన కలల సౌధం ఇప్పుడు కరిగిపోతోంది. ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. అప్పటి దుస్థితిని చూసి పాత బిల్డింగ్ను తొలగించి అత్యాధునిక హంగులతో రెండు టవర్లు నిర్మిస్తామని ప్రకటించారు. అంటే.. అప్పటి నుంచే ఉస్మానియా కట్టడాన్ని కూల్చే ఆలోచన కేసీఆర్ మదిలో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. హెరిటేజ్ భవనాన్ని కూల్చకుండా ఖాళీ స్థలంలో టవర్లు నిర్మించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజాగా.. ఇటీవల కురిసిన వర్షాలకు బిల్డింగ్లోకి వరద వచ్చి పెషెంట్లు ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ వరద నాలాల నుంచి వచ్చిందే తప్ప బిల్డింగ్లో లోపాలు పెద్దగా ఏమీ లేవు. ఎప్పుడో 1908లో హైదరాబాద్కు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నీళ్లు వస్తే.. మళ్లీ ఇప్పుడు వచ్చాయి. ఇన్నాళ్లు రిపేర్లను పట్టించుకోని సర్కార్ మాత్రం ఒక్కసారిగా తెరమీదకి వచ్చింది. పాత బిల్డింగ్ పడగొట్టి కొత్తవి నిర్మించాలని ఆలోచనకు వచ్చింది. వాస్తవానికి ఉస్మానియా హాస్పిటల్ను జేఎన్టీయూ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే కూలుస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అసలు జేఎన్టీయూ రిపోర్టులో ఏముందో స్పష్టం చేయాలంటూ ఫస్ట్ నుంచి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి రిపోర్టులో కూడా ఎక్కడా భవనాన్ని కూల్చాలని రెకమండ్ చేయలేదు. అక్కడక్కడ ఉన్న లోపాలను సరిదిద్దాలని సూచించింది. పెచ్చులూడడం, గోడల్లో నీళ్లు ఇంకడం.. మొక్కలు మొలవడం.. స్తంభాలు తుప్పుపట్టడంపై అందులో పేర్కొంది. ఆ రిపేర్లు ఎలా చేయాలో కూడా సొల్యూషన్ చెప్పింది.
Also Read: కేసీఆర్ కు అసమ్మతి జ్వాల తగలనుందా?
జేఎన్టీయూ రిపోర్టుతో ఉస్మానియా బిల్డింగ్ కూల్చేందుకు సర్కార్ నిర్ణయానికి రావడంతో ఇంటాక్ (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) సంస్థం రంగంలోకి దిగింది. ఆగస్టు 2,3 తేదీల్లో ఉస్మానియను సందర్శించింది. దానిపై రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఉస్మానియా పునాది గట్టిగా ఉందని, గోడలూ పటిష్టంగానే ఉన్నాయని చెప్పింది. కేవలం పై పెచ్చులే ఊడుతున్నాయని తేల్చింది. వాన నీళ్లు పోయేందుకు వేసిన పైపులు పగిలిపోయాయని.. ఆ నీరు గోడల్లో ఇంకుతోందని పేర్కొంది. తగిన రిపేర్లు చేస్తే దశాబ్దాల పాటు నిలుస్తుందని అంది. కానీ.. ఇవేమీ పట్టని సర్కార్ రిపేర్లను పక్కన పెట్టింది.
దీనిపై పలువురు పిటిషనర్లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పాత బిల్డింగ్ కూల్చకుండా కొత్త వాటిని నిర్మించాలనే కోరారు. దీనిపై విచారిస్తున్న హైకోర్టు తాజాగా ఆస్పత్రి సైట్ ప్లాన్ సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కౌంటర్ దాఖలు చేయడంతో హైకోర్టు కూడా ఈ నివేదికను కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఫైనల్ తీర్పు కనుక ప్రభుత్వానికి పాజిటివ్గా వస్తే వందేడ్ల చరిత్ర కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం..!