తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ రోజురోజుకూ ఉధృతమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సర్కారు రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను చేపడుతోందని తెలంగాణ సర్కారు విమర్శలు గుప్పించడంతో మొదలైన పంచాయితీ.. కృష్ణాబోర్డు వరకు చేరడంతో ముదురుపాకాన పడినట్టైంది. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని తెలంగాణ.. తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేపడుతోందని ఏపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. దీంతో.. వాతావరణం మరింత వేడెక్కింది.
ఏపీ నిబంధనలు పాటించనప్పుడు తామెందుకు పాటిస్తామంటూ.. శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటితో విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టింది తెలంగాణ. పులిచింత ప్రాజెక్టు పవర్ హౌస్ లోనూ కరెంటు తయారీ చేపట్టింది. ఈ ప్రాజెక్టు ఏపీలో ఉన్నా.. పవర్ హౌస్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంగతి తెలిసిందే. అటు నాగార్జున సాగర్ లోనూ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయమై రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
నిన్న ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి పేరుతో కృష్ణాబోర్డుకు లేఖ వెళ్లింది. అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, దాన్ని తక్షణమే అడ్డుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. తెలంగాణ సర్కారు మరో ముందడుగు వేసి, ప్రాజెక్టుల వద్ద పోలీసులను మోహరించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ తోపాటు దిగువన ఉన్న పులిచింత ప్రాజెక్టు వద్ద కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది.
నాగార్జున సాగర్ వద్ద ఇద్దరు డీఎస్పీలు సహా.. దాదాపు 120 మంది వరకు పహారా కాస్తున్నారు. శ్రీశైలం, పులించింతల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు నిర్వహణ అధికారులను, సిబ్బందిని మినహా.. మరెవ్వరినీ లోనికి వెళ్లనీయకుండా భద్రతాచర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టుల వద్ద నుంచి వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సిబ్బందిని కూడా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తున్నారు.
మొత్తానికి.. అక్రమ ప్రాజెక్టుల విమర్శలతో మొదలైన జల జగడం.. విద్యుత్ వార్ గా టర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎటు మారుతాయో ఎవ్వరూ చెప్పలేకుండా ఉంది. మొత్తానికి రాష్ట్ర విభజన రోజుల్లో నెలకొన్న పరిస్థితులు అయితే వచ్చేశాయని అంటున్నారు. మరి, ఫైనల్ గా ఏం జరుగుతుందన్నది చూడాలి.