కరోనా వైరస్ లేని రాష్ట్రంగా తెలంగాణ మారడానికి కేసీఆర్ స్వయంగా ఇస్తున్న పలు డెడ్ లైన్ లు దాటి పోతున్నా వైరస్ కట్టడి కనిపించక పోవడంతో వైరస్ తీవ్రతను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తాజాగా, దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా లక్షణాలతో మరణించిన వారికి వైరస్ టెస్టులు చేయించొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పలు అనుమానాలకు దారితీస్తుంది.
ఈ మేరకు అన్ని జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లకు, దవాఖానాల సూపరింటెండెంట్లకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాల నుంచి కరోనా టెస్టుల కోసం శాంపిల్స్ సేకరించవద్దని అందులో స్పష్టం చేశారు.
కరోనా లక్షణాలతో చనిపోతే ‘కరోనా పాజిటివ్ (డీమ్డ్ టు బీ పాజిటివ్)’గానే భావించాలని సూచించారు. కరోనా మృతుల అంత్యక్రియలకు పాటించిన గైడ్లైన్స్నే వాళ్లకూ వర్తింపజేయనున్నారు. అయితే వెంటనే కరోనా మృతుల జాబితాలో మాత్రం కలపవద్దని స్పష్టం చేశారు.
ఆ తర్వాత సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు, సన్నిహితులను క్వారంటైన్చేసి టెస్టులు చేయాలని నిర్ణయించారు. వారిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే మాత్రమే ఆ మరణాన్ని కరోనా మృతుల జాబితాలో కలపాలని నిర్ణయించారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 21 మంది చనిపోయారు. అందులో సుమారు పది మందికి మరణించాక చేసిన టెస్టుల్లోనే పాజిటివ్గా తేరినవారు కావడం గమనార్హం. తర్వాత వారి కుటుంబ సభ్యులకు టెస్టులు చేస్తే.. పాజిటివ్ గా బయటపడింది.
హైదరాబాద్ పాతబస్తీలో ఓ మహిళ మరణించాక చేసిన టెస్టుల్లో కరోనా ఉన్నట్టు తేలింది. ఆమె కుటుంబ సభ్యుల్లో ఏకంగా 13 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో.. చనిపోయినవాళ్లకు టెస్టులు చేయొద్దన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు.