Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: దశాబ్దపు త్యాగ ఫలం.. నెరవేరాయా నాటి ఆశలు, ఆకాంక్షలు!

తెలంగాణ రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా అప్పుల కూపంలోకి కూరుకుపోతోంది. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ సంక్షే మపథకాల పేరిట ప్రజలకు నేరుగా డబ్బులు పంచుతుండడంతో రాష్ట్ర ఆర్థి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎనిమిదేళ్లలో తెలంగాణ బంగారు మయం అయిందో లేదో తెలియదు కాని ప్రతీ తెలంగాణ ఒక్కరిపై తెలియకుండానే రూ.2 లక్షల అప్పులు మాత్రం ఉంది. ఈ ఏడాది నుంచి పరిస్థితి మరీ దిగజారుతోంది. అప్పులు చేయనిదే నెల గడిచే పరిస్థితి ఉండడం లేదు.

Written By: Raj Shekar, Updated On : June 2, 2023 9:59 am

Telangana Formation Day

Follow us on

Telangana Formation Day: జూన్‌ 2 తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. ఆరు దశాబ్దాలపాటు ఎంతో మంది అమరవీరుల త్యాగాల కారణంగా.. ఎన్నో ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు జూన్‌ రెండో తేదీ. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్టాన్ని సాకారం చేసేందుకు పురుడు పోసుకుంది తెలంగాణ రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా శక్తి వంచన లేకుండా పోరాడిన తెలంగాణ ప్రజలు.. సొంత రాష్ట్ర కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. 1969 నుండే తెలంగాణ కోసం ఉద్యమాలు ప్రారంభం కాగా.. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదిక దొరికినట్లయ్యింది.

అసమానతలే ఉద్యమానికి ఊపిరి..
తెలంగాణ రాష్ట్రం నేటితో దశాబ్దం పూర్తి చేసుకుంది. సరిగ్గా ఇదే రోజున అంటే 2014, జూన్‌ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. భాషా ప్రాతిపదికన 1956లో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు భాగంగా ఉన్న తెలంగాణ 58 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయింది. విదర్భ, ఉత్తరాఖండ్, హరిత్‌ప్రదేశ్‌ లాగానే సుదీర్ఘ కాలంగా ప్రత్యేక రాష్ట్రసాధన కోసం తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం సాగింది. ఈ ఉద్యమాలు భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటులో పరిమితులను బైటపెట్టాయి. ప్రజల మధ్య చారిత్రక, రాజకీయ, ఆర్థ్ధిక, సాంస్కృతిక అసమానతలు, విభేదాలు, వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న భావోద్వేగాలు ఈ ఉద్యమానికి ఊపిరిలూదుతూ వచ్చాయి.

ప్రాంతాల మధ్య వైరుధ్యం..
అసలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కోస్తాంధ్రా, రాయలసీమ, తెలంగాణ అనే పేర్లలోనే వివిధ ప్రాంతాల మధ్య వైరుధ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘మేమంతా తెలుగువాళ్లం’ అంటూ దాదాపు అర్ధ శతాబ్దంపాటు ఒక రాష్ట్రంగా కలిసి ఉన్నప్పటికీ, తెలుగు మాట్లాడే ప్రజల మధ్య సామాజికంగా, సాంస్కృతికంగా, భావోద్వేగాల పరంగా ఐక్యత ఏర్పడలేదు. ఒక్క తెలంగాణలోనే కాదు. రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది.

ఉద్యమంలో మూడు దశలు..
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా మూడు దశలు కనిపిస్తాయి. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడే సమయంలోనే వ్యతిరేక వినిపించడం మొదటి దశ. ఇక 1960 లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రెండోది. 1990 తర్వాత కనిపించిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మూడో దశగా చెప్పుకోవచ్చు. ముల్కీ నిబంధనల ఉల్లంఘనతో 1960లో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది.

మూడో దశ కీలకం..
మూడో దశ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైంది. అధికారంలో సరైన వాటా ఇవ్వకపోవడం, నిధుల కేటాయింపులో వివక్ష, ప్రాంతీయ వెనకబాటుతనం ఈ మూడు అంశాలు తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు సమయంలోనే దీనిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ‘తెలంగాణ ప్రజల భయం ఏంటంటే.. వారు ఆంధ్రాలో కలిసిపోయినా, ఆంధ్రులతో సరిసమానంగా వారు హక్కులను అనుభవించలేరు. ఈ ఒప్పందంలో ఆంధ్రులు తమ ప్రయోజనాలను సత్వరమే అందిపుచ్చుకుంటారు. చివరకు తెలంగాణ కోస్తాంధ్రులకు కాలనీగా మారిపోతుంది’ అని ఎస్‌ఆర్‌సీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతోంది. 2014 జూన్‌ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. 2023 జూన్‌
2న తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెడుతోంది. ఈ తొమ్మిదేళ్లలో ఆశించిన విజయాలూ దక్కాయి, కొన్ని నిరాశలూ ఎదురయ్యాయి.

త్యాగాలు ఆశించిన లక్ష్యాలను సాధించాయా?
తెలంగాణ ఉద్యమం అనేది ప్రజాచైతన్యం, రాజకీయ చైతన్యం అనే రెండు మూలస్థంభాల మీద నిలబడింది. ఉద్యమ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత భారత రాష్ట్ర సమితి ప్రధాన రాజకీయ పార్టీగా ఆవిర్భవించగా, తెలంగాణ ప్రజలను చైతన్యపరచడంలో ప్రజాసంఘాలు కీలక పాత్ర పోషించాయి. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా, బీఆర్‌ఎస్‌ పాలన ఎలా ఉంది? ఉద్యమ ప్రాథమిక లక్ష్యాల సాధన ఎంత వరకు జరిగింది? అన్నది విశ్లేషించుకోవాల్సిన సమయం ఇది.

ఉద్యమమంతా సాంస్కృతిక నేపథ్యమే..
తెలంగాణ ఉద్యమం యావత్తు సాంస్కృతిక నేపథ్యంగా సాగుతుంది. కోస్తాంధ్ర సంస్కృతికి, తెలంగాణ సంస్కృతికి మధ్య చాలా అంతరాలున్నాయి. కళాసాంస్కృతిక రంగాలపై ఆంధ్రులకు మంచి పట్టుంది. సినిమా, కళా, పత్రికా రంగాలను వారు పూర్తిగా ఆక్రమించగా, తెలంగాణ ఉద్యమం అంతా పాటలు, కథలతోనే నిండిపోయింది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు, బతుకమ్మ పండగలు ప్రతీకలుగా మారిపోయాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బతుకమ్మ పండుగను పూర్తిస్థాయిలో రాష్ట్ర పండగగా మార్చేశారు. ఇక్కడే కాదు.. తెలంగాణ ప్రజలున్న అమెరికా, ఐరోపా దేశాలతోపాటు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లాంటి దేశాలలో కూడా ఘనంగా జరుపుకున్నారు.

కరెంటు కోతల్లేకుండా..
2014 సంవత్సరం జూన్‌ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. కొత్త రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాధ్యతలు చేపట్టిన ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఎన్నో మార్పులొచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రానికి ఎంతో వెలుగొచ్చింది. తెలంగాణ వస్తే కరెంట్‌ లేక చీకట్లు తప్పవన్న నాటి పాలకుల హెచ్చరికలు తప్పని నిరూపిస్తూ.. కరెంటు కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ను అందిస్తున్నారు. విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగినా.. డిమాండ్‌ కు సరిపడా సరఫరా చేస్తున్నారు.

చెరువుల్లో నీటి కళకళ..
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో నీటి కొరత తీవ్రంగా ఉండేది. కరువుతో ప్రజలు అల్లాడిపోయేవారు. రాష్ట్రంలోని అనేక చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అందుకే కేసీఆర్‌ సర్కారు మిషన్‌ కాకతీయ పేరిటన చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. వేలాది చెరువులకు పునరుజ్జీవం పోసింది. దీంతో చెరువులన్నీ కళకళలాడుతున్నాయి. అయితే ఇందులో లబ్ది రైతుల కేంటే టీఆర్‌ఎస్‌ నాయకులకు ఎక్కువ జరిగిందన్నా ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, కుంటలు మండు వేసవిలో కూడా నిండు కుండను తలపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు అతిపెద్ద స్కాం అని విపక్షాల ఆరోపణ..

ఇంటింటికి నల్లా..
మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ కొళాయి(నల్లా) కనెక్షన్‌ ఏర్పాటు చేసి మంచి నీరు సైతం అందిస్తున్నారు. గోదావరి పక్కనే పారుతున్నా.. ఇన్నాళ్లూ బోరు నీళ్లు మాత్రమే తాగిన పల్లెవాసులు ఇప్పుడు గోదారి నీళ్లను తాగుతున్నారు. అయితే నాలుగేళ్లయినా మారుమూల పల్లెలకు ఇప్పటికీ ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ లేదు. ఉన్న గ్రామాలకు నీళ్లు రావడం లేదు.

సంక్షేమ పథకాలు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ సర్కారు తీసుకొచ్చిన రైతు బంధు, కళ్యాణలక్ష్మీ, కంటి వెలుగు పథకాలు ఇప్పటికీ ఓ సంచలనం. మిగిలిన రాష్ట్రాలు సైతం వీటిని అమలు చేయడానికి ఆసక్తి చూపాయి. పేదింటి ఆడబిడ్డలకు పెళ్లికి డబ్బులు ఇవ్వడం కోసం రూపొందించిన కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్‌ పథకం అందరి ప్రశంసలు అందుకుంది. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేలు చొప్పున ప్రతి ఏటా రెండు విడతల్లో పది వేల చొప్పున నేరుగా రైతులకు సర్కారే పెట్టుబడి సాయం చేస్తోంది. దళితబంధు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినా ఆశించిన లక్ష్యం చేరలేదు.

కేసీఆర్‌ కిట్‌..
ఒకప్పుడు సర్కారీ దవాఖానా అంటే భయపడే ప్రజలు.. ఇప్పుడు గవర్నమెంట్‌ ఆస్పత్రుల వైపు ఆసక్తి చూపుతున్నారు. సర్కారీ దవఖానాల్లో మౌలిక వసతులు మెరుగుపడటం, నాణ్యమైన వైద్యం అందేలా చూస్తున్నారు. ఇక గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం చేయించుకుంటే.. కేసీఆర్‌ కిట్‌ పేరిట రూ.2,150తో పాటు ఓ కిట్‌ అందజేయనున్నారు. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12 వేలను అందజేస్తున్నారు.

ఐటీలోనూ మేటి తెలంగాణ..
తెలంగాణ అవతరించిన తర్వాత పేదలకు ఆసరా పింఛన్లు నిజంగానే ఆసరానిస్తున్నాయి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 వచ్చే పెన్షన్‌ రూ.2,016కు పెంచారు. కేవలం పెన్షన్ల కోసం తెలంగాణ సర్కారు 12 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతోంది. తెలంగాణ ఉద్యమాల సమయంలో ఐటీ కంపెనీలు కొత్త కార్యాలయాల ఏర్పాటుకు వెనుకడుగు వేశాయి. కానీ ఇదంతా తాత్కాలికమే అని నిరూపిస్తూ.. ప్రత్యేక రాష్ట్రం అవతరించాక హైదరాబాద్‌ ఐటీ శరవేగంగా పురోగమించింది. బెంగళూరుకు పోటీగా భాగ్యనగరం ఐటీ సంస్థలను ఆకట్టుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఐటీ సంస్థలు హైదరాబాదులో కార్యకలాపాలు వేగం పెంచాయి. ఐటీ రంగం ద్వారా తెలంగాణలో దాదాపు 5.80 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

అభివృద్ధి వెంటే.. అప్పులు..
తెలంగాణ రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా అప్పుల కూపంలోకి కూరుకుపోతోంది. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ సంక్షే మపథకాల పేరిట ప్రజలకు నేరుగా డబ్బులు పంచుతుండడంతో రాష్ట్ర ఆర్థి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎనిమిదేళ్లలో తెలంగాణ బంగారు మయం అయిందో లేదో తెలియదు కాని ప్రతీ తెలంగాణ ఒక్కరిపై తెలియకుండానే రూ.2 లక్షల అప్పులు మాత్రం ఉంది. ఈ ఏడాది నుంచి పరిస్థితి మరీ దిగజారుతోంది. అప్పులు చేయనిదే నెల గడిచే పరిస్థితి ఉండడం లేదు.

ప్రభుత్వ రంగసంస్థలకు పెరుగుతున్న బకాయిలు..
తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ రంగ సస్థల నుంచి కూడా భారీగా అప్పులు తీసుకుంటోంది. సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిందిపోయి.. సంస్థల నుంచే డబ్బులు తీసుకోవడం గమనార్హం. సింగరేణి సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ.13 వేల కోట్లు బయాయి పడినట్లు సమాచారం. విద్యుత్‌ సంస్థ బకాయిలు కూడా రూ.8 వేల కోట్ల వరకు ఉన్నాయని తెలసింది. ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడి నుంచి అప్పులు తీసుకుంటున్న ప్రభుత్వం వాటిని ఉత్పాదకరంగంలో పెట్టుబడి పెట్టడం లేదు.

నెలనెలా వేతనాలు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి..
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఉద్యోగ భద్రత, నెలనెలా సమయానికి వేతనాలు ఇవ్వడం, ఏడాదికోసారి ఇంట్రిమెంటు, డీఏ, ఇతర సదుపాయాలు ఉంటాయి అన్న భావన ఉంటుంది. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ పాలనలో కీలకమైన ఉద్యోగులకు నెలలో ఎప్పుడు వేతనం వస్తుందో తెలియని పరిస్థితి. నెలనెలా వచ్చే వేతనంపై ఉద్యోగులు ఈఎంఐలు, బ్యాంకు రుణాల వడ్డీలు, గృహ రుణాల ఇన్‌స్టాల్‌మెంట్‌.. ఇతరత్రా వాటికి సబంధం ఉంటుంది. కానీ ఐదారు నెలలుగా పరిస్థితి మారింది. నెలలో ఎప్పుడు వేతనం వస్తుందో తెలియని పరిస్థితి. ఆసరా పథకం పేరిట వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత వృత్తులు వారికి ప్రభుత్వం పింఛన్లు ఇస్తోంది. వీటి కోసం కూడా లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు. పింఛన్‌ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి వాటిపై ఆధారపడిన అనేక మంది బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పరిప్థితి.

ఎందుకీ దుస్థితి..
మిగుల బడ్జెట్‌తో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర ప్రస్తుతం రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాడేనాటికి కేవలం రూ.60 వేల కోట్ల అప్పులు ఉండేవి. కానీ తెలంగాణ వచ్చాక.. కరెంటు సమస్య, నీటి సమస్య మినహా ఏదీ పరిష్కరం కాలేదు. నియామకాలు జరుగలేదు. కేసీఆర్‌ ప్రభుత్వంపై కొన్ని రోజులుగా ముప్పేటా విమర్శల దాడి పెరగడంతో ఇటీవలే నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. నియామకాలు మాత్రం ఎప్పుడు జరుగాయో ఎవరికీ తెలియదు. కానీ అప్పులు మాత్రం భారీగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణం రాజకీయ ప్రయోజనాలకే పాలకులు ప్రాధాన్యత ఇవ్వడం. ఎన్నికల్లో గెలవడం కోసం సంక్షేమ పథకాలు అంటూ తెలంగాణలో డబ్బుల పంపిణీ పెరిగింది. ఉత్పాదకత రంగంలో పెట్టుబడి కోసం చేయాల్సి అప్పులను ప్రజలకు పంపిణీ చేయడంతో క్రమంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కరిగిపోతూ వస్తోంది. తెచ్చిన అప్పులకు నెలనెలా వందల కోట్లు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. దీంతో తాజాగా పన్నుల పెంపుపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది.