తెలంగాణలో రాజకీయాలు నిన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టుగా మారిపోయాయి. నిన్నామొన్నటి టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంది బీజేపీ. వాస్తవానికి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. ఆ పార్టీ నామమాత్రంగానే మారిపోయింది. కానీ.. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా మారడంతో లెక్కలు మారిపోయాయి. తెలంగాణలో త్రిముఖ పోరు ఖాయమనే పరిస్థితి తలెత్తింది. దీంతో.. పార్టీలన్నీ అప్రమత్తం అయ్యాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్టివ్ అయ్యింది కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాతనే అనే చర్చ కూడా ఉంది. ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రేవంత్.. తనదైన దూకుడును మొదటి రోజు నుంచే కొనసాగిస్తున్నారు. మళ్లీ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరుగా తెలంగాణ రాజకీయాలను మార్చాలనేది పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ లక్ష్యం. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకోవాలనేది ఫైనల్ టార్గెట్. ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి దూకుడు కూడా ఇదే విధంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దీంతో.. సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్న బీజేపీ.. అలర్ట్ అయ్యింది. ఈ రేసులో తాము వెనకబడకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 9న హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రారంభించి, అక్టోబరు 2న హుజూరాబాద్ లో నిర్వహించిన సభతో యాత్ర ముగించనున్నట్టు ప్రకటించారు. మొతత్ం 55 రోజులపాటు 750 కిలోమీటర్ల మేర ఈ యాద్ర సాగుతుందని తెలిపారు.
వాస్తవానికి.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ.. రేసులో ముందు ఉండాలనుకున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను ప్రకటించేశారు. మరి, రేవంత్ ఎప్పుడు పాదయాత్ర ప్రకటిస్తారో చూడాలి. అటు షర్మిల కూడా పాదయాత్ర చేస్తానని గతంలోనే ప్రకటించారు. మొత్తానికి.. తెలంగాణలో రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.