Homeజాతీయ వార్తలుTeenmar Mallanna: బీజేపీకి గుడ్ బై.. ‘టీం-7200’.. కొత్త పార్టీ దిశగా తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna: బీజేపీకి గుడ్ బై.. ‘టీం-7200’.. కొత్త పార్టీ దిశగా తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna: బీజేపీలో కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కమలం పార్టీలో సరైన ప్రోత్సాహం లేకపోవడంతోనే ఆ పార్టీని వీడయేందుకు రెడీ అయినట్టుగా కుండబద్దలు కొట్టారు. గతంలో మాదిరిగా సొంతంగా తన అనుచరవర్గంతో ప్రభుత్వంపై ముప్పేట విమర్శలు చేసేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీలో ఉంటే తాను స్వేచ్ఛగా పనిచేయలేనని స్పష్టం చేశారు. జర్నలిస్టుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అధికార టీఆర్ఎస్ పార్టీకి కంట్లో నలుసుగా మారాడు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఆధారాలతో సహా తన యూట్యూబ్ ఛానెల్ లో ఎత్తిచూపేవాడు. ఈ క్రమంలో అధికార పార్టీ ఆగ్రహానికి గురై కొన్ని కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లాడు. ఆ సమయంలో బీజేపీ నాయకులు సహకరించారు. మొత్తానికి బెయిల్ పై బయటకొచ్చిన మల్లన్న బీజేపీలో చేరారు. కానీ కొంత కాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లనని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

Teenmar Mallanna
Teenmar Mallanna

ఓ టీవీ చానెల్ లో వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించిన మల్లన్న ఆ తరువాత సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ పెట్టాడు. ఈ ఛానెల్ ద్వారా ప్రభుత్వం లోపాలను వీడియోలతో సహా ఎత్తి చూపాడు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని వీడియోలు తయారు చేయడంతో మల్లన్నకు చాలా మంది ఫ్యాన్స్ పెరిగాయి. అంతేకాకుండా ఆయనతో కలిసి పనిచేయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యేకంగా పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యారు. సంఘం పెట్టకపోయినా తమది 7200 సైన్యం అంటూ ప్రకటించాడు. దీంతో ఆయన అనుచరులంతా ‘7200 తీన్మార్ మల్లన్న’ అంటూ ప్రజల్లోకి వెళ్లారు. ఈక్రమంలో ప్రజాధరణ పెరిగిపోవడంతో గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడు. కాంగ్రెస్, బీజేపీలను వెనక్కి నెట్టి మల్లన్న రెండో స్థానంలోకి రావడంతో ఆయన బలం ఏంటో నిరూపితమైంది.

Also Read: Prabhas Salaar: ప్రభాస్ రొమాన్స్ పూర్తి అయ్యింది.. మరోపక్క వీడియో క్లిప్ వైరల్ !

కేసీఆర్ టార్గెట్ గా చేసిన కొన్ని వీడియోలతో మల్లన్నపై కొన్ని కేసులు నమోదయ్యాయి. జైల్లో కూడా పెట్టారు. అప్పటి వరకు ప్రజల్లోకి వెళ్లి సభలు, సమావేశాలు నిర్వహించాలని అనుకున్న మల్లన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. మల్లన్న జైల్లో ఉన్న సమయంలో ఆయనకు బీజేపీ నాయకులు సహకరించారు. మల్లన్న కుటుంబ సభ్యులను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఢిల్లీకి తీసుకెళ్లి అమిత్ షాకు వినతి పత్రం ఇప్పించారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. మల్లన్నకు మొత్తానికి బెయిల్ వచ్చింది. దీంతో ఆయన ఒంటరిగా కంటే పార్టీ పరంగా వెళితే బాగుంటుందని ఆలోచించాడు. ఈ క్రమంలో బీజేపీలోకి చేరాడు.

కమలం గూటికి చేరిన తరువాత మల్లన్నపై కొన్ని షరతులు, ఆంక్షలు విధించారు. ముఖ్యంగా తన యూట్యూబ్ చానెల్ ద్వారా విమర్శల నేపథ్యంలో పరిమితులు పాటించాలన్నారు. గతంలో ఓసారి కేటీఆర్, ఆయన కుమారుడిపై చేసిన వ్యాఖ్యలపై మల్లన్నను పార్టీ నాయకులు మందలించినట్లు సమాచారం. అప్పటి నుంచి తన ఛానెల్ ద్వారా ఎక్కువగా వీడియోలు ప్రసారం చేయడం లేదు. అయితే ఆయన అనుచర వర్గం మాత్రం అసంతృప్తిగా ఉంటోంది. మల్లన్న ఒంటరిగా ఉన్నప్పుడే ఎక్కువగా ప్రజాధరణ ఉండేదని భావించారు.

ఇక ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో యాక్టివ్ గా ముందుకెళుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్రకు మల్లన్న హాజరు కావడం లేదు. కానీ మల్లన్నను బండి సంజయ్ ఆదరించడం లేదని కొందరు అంటున్నారు. ఈక్రమంలో తనను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదని మల్లన్న మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలో ఉండి ఆంక్షలతో ఉండడం కంటే ఒంటరిగా వెళ్తేనే బాగుంటుందని కొందరు సన్నిహితులు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై పొగడ్తల వర్షం కురిపించారు. నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా మల్లన్నకు బీజేపీ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన ఇక నుంచి బీజేపీ కార్యాలయానికి వెళ్లనని ప్రకటించారు. దీంతో మల్లన్న ఇక బీజేపీకి రాం రాం చెప్పనట్లేనని అనుకుంటున్నారు.

Also Read: Shakuni Temple: శకునికీ ఓ ఆలయం ఉంది తెలుసా?

ప్రస్తుతం టీం7200 పేరుతో అధికార టీఆర్ఎస్ ను నిలదీసేందుకు ఒక టీంలా తీన్మార్ మల్లన్న ముందుకు వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు టీంకు ఒక గౌరవ అధ్యక్షుడిని కూడా ఆయన నియమించారు. ఇక నుంచి దూకుడుగా వెళతానని.. బీజేపీ ఆఫీసులోకి అడుగుపెట్టనని మల్లన్న ప్రకటించారు. సొంత ఎజెండాతోనే ముందుకు సాగుతానని తెలిపారు. దీంతో తీన్మార్ మల్లన్న త్వరలోనే సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది.

Teenmaar Mallanna Announces To Start New Political Party Soon | Mallanna About New Party | V6 News

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version