TDP Vs YCP
TDP Vs YCP: ఇటీవల టిడిపి కార్యకర్తలు మారారు. ఎక్కడ లేని ధైర్యం కూడదిసుకుని పోరాడడం ప్రారంభించారు. గత ఎన్నికల్లో అధికారం పోయేసరికి వారికి మైండ్ బ్లాక్ అయింది. వైసీపీ రివెంజ్ పాలిటిక్స్ తో టిడిపి నాయకులు ఇళ్లకే పరిమితమయ్యారు. బయటికి వచ్చి పోరాడండి అంటూ చంద్రబాబు పిలుపు ఇచ్చినా పెద్దగా స్పందన లేదు. కానీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాక టిడిపి శ్రేణుల్లో ధైర్యం పెరిగింది. జన సైనికులు రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తున్న తీరును చూసి టిడిపి నేతలు బయటకు రాని అనివార్య పరిస్థితి ఎదురైంది.
టిడిపికి క్షేత్రస్థాయిలో క్యాడర్ బలోపేతంగా ఉంది. ఇది కాదనలేని నిజం. కానీ నాయకత్వం పై నమ్మకం లేక పార్టీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. కానీ నాలుగేళ్ల తర్వాత టిడిపి శ్రేణుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అధికారంలోకి రావాలన్న కసి వారి కళ్ళల్లో మెదులుతోంది. ఇన్నాళ్లు మౌనంగా భరించిన తెలుగు తమ్ముళ్లు తిరగబడడం ప్రారంభించారు.
పులివెందుల అంటేనే వైసిపి అడ్డా. వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. అక్కడ అడుగు పెట్టాలంటే టిడిపి శ్రేణులకు ఒక రకమైన భయం. కానీ ఇటీవల సీన్ మారినట్టు కనిపిస్తోంది. పులివెందుల సెంటర్ కు వెళ్లి మరి చంద్రబాబు సౌండ్ చేశారు. వేలాది మంది టిడిపి శ్రేణులు కదం తొక్కాయి. టిడిపి శ్రేణులు గుమిగూడిన చోట ఓ కారు వచ్చి ఆగింది. వైసీపీ జెండాలతో రెపరెపలాడిస్తూ మీసం మేలేసాడో వైసీపీ కార్యకర్త. టిడిపి కార్యకర్తలు తిరగబడే సరికి కారుతో పరారయ్యాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టిడిపి శ్రేణుల్లో వచ్చిన ధైర్యానికి మచ్చుతునకగా నిలిచాయి. ఆ వాహనంపై వైఎస్జె అని ఉండడంతో.. సాక్షాత్ సీఎం జగనే టిడిపి శ్రేణులకు భయపడి పారిపోతున్నారు అన్న కామెంట్స్ వినిపించాయి. పులివెందులలో టిడిపికి ఇదో రికార్డె.
అటు పుంగనూరులో కూడా టిడిపి శ్రేణులు చూపిన తెగువ మారిన పరిస్థితిని తెలియజేస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో టిడిపి పరిస్థితి అందరికీ తెలిసిందే. అందుకే పెద్దిరెడ్డి తన నియోజకవర్గం పై కాకుండా కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. కుప్పంలో సైతం తన మార్కు రాజకీయాన్ని చూపిస్తున్నారు. ఇటువంటి తరుణంలో పెద్దిరెడ్డికి టీడీపీ శ్రేణులు పుంగనూరులో చుక్కలు చూపించారు. ఎప్పటి మాదిరిగానే చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు పాత ప్లాన్లు అమలు చేశాయి. టిడిపి శ్రేణులు పై దాడులు చేస్తే భయంతో వెనక్కి వెళ్లిపోతారని అంచనా వేశారు. అయితే టిడిపి శ్రేణులు నో నెవర్ అంటూ తిరగబడ్డాయి. వైసీపీ నేతలు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. వారికి అండగా నిలబడాలని పరితపించిన పోలీసులు గాయపడ్డారు. టిడిపి శ్రేణుల స్పీడును తగ్గించడానికి పోలీసులు సైతం రాళ్లదాడులకు దిగడం విస్మయ పరుస్తోంది.
వచ్చే ఎన్నికలు ఎలా జరిపించాలో వైసీపీ ప్లాన్ చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే టిడిపి శ్రేణులు సైతం సిద్ధపడుతున్నాయి. వైసీపీకి ఎలాగూ పోలీసుల అండదండలు ఉంటాయి. అందుకు క్యాడర్ ని ఎలా సంసిద్ధం చేయాలా అన్న ఆందోళనలో చంద్రబాబు ఉండేవారు. కానీ రాయలసీమ పర్యటనతో చంద్రబాబు లో ఉన్న ఆందోళన పటాపంచలైంది. రాయలసీమ అడ్డాలోనే వైసీపీని టిడిపి శ్రేణులు ఎదుర్కోగలిగాయి. రాష్ట్రంలో మిగతా చోట్ల సైతం ఇటువంటి ప్రతిఘటనకు తెలుగు తమ్ముళ్లు మానసికంగా సిద్ధపడిపోయారు. ఇది టిడిపి నాయకత్వానికి ఆనందాన్ని ఇచ్చే అంశం.