Jaganannaku Chebudam : అనుకున్నట్టే అయ్యింది. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి రాజకీయ వేధింపులు ప్రారంభమయ్యాయి. సమస్యల పరిష్కారం కోసం వైసీపీ ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కాల్ సెంటర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి గాను 1902 పేరిట టోల్ ఫ్రీనంబర్ ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇంకా ఈ కాల్ సెంటర్ కుదురుకోక ముందే విపక్ష నాయకులు ఫోన్లు చేసి తెగ హడావుడి చేస్తున్నారు. అప్పుడే వైఫల్యం అంటూ ప్రచారం మొదలుపెట్టారు. టీడీపీ అయితే ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ద్వారా హంగామా చేసింది. అది విమర్శలకు దారితీస్తోంది.
రామయ్య కాల్ తో..
జగనన్నకు చెబుదాం కాల్ సెంటర్ కు మంగళవారం వర్ల రామయ్య కాల్ చేశారు. సమస్య చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే సాంకేతికపరమైన ఇబ్బందులున్నాయని చెప్పిన సదరు కాల్ సెంటర్ ఉద్యోగిపై రామయ్య విరుచుకుపడ్డారు. తిట్ల దండకానికి దిగారు. నీ దుంప తెగ అంటూ దూషణ స్టార్ట్ చేశారు. నీ పేరు చెప్పు.. ఫోన్ నెంబర్ చెప్పు అంటూ ఓ చిరుద్యోగిపై చిర్రుబుర్రులాడారు. గ్రీవెన్స్ అధికారి ఓపికగా సమాధానం చెబుతున్నా రామయ్య వినలేదు. విమర్శలతో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారుతున్నాయి. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జాగ్రత్తలు లేకపోతే..
అయితే ఏ ప్రభుత్వం అయినా గ్రీవెన్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం చేస్తుంటాయి. అంతెందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా చంద్రబాబు ఇటువంటి ప్రయత్నాలు చాలా చేశారు. కానీ వాటి ఫలితం కంటే.. ప్రతికూలతలే ఎక్కువ. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అయితే కార్యక్రమం ఇలా మొదలైందో లేదో.. బ్యాడ్ చేసేందుకు టీడీపీ ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. 1902 టోల్ ఫ్రీ నంబర్ కు వినతులు కంటే ఫిర్యాదులే అధికంగా వస్తాయి. కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టోల్ ఫ్రీ నంబర్కు వెళ్లే కాల్స్ను రిసీవ్ చేసుకునే వారికి సంబంధిత సబ్జెక్టుల్లో అవగాహన ఉండాలి.
ఓపిక చాలా అవసరం..
అటు సమస్యలు, ఇటు ఫిర్యాదులు అందించడానికి వేదిక కాబట్టి కాల్ సెంటర్ సిబ్బంది కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వినే ఓపిక ఉండాలి. ఇది ఒక ఉద్యోగంగా కాకుండా, సేవా కార్యక్రమంగా భావించి ప్రజాసమస్యల పరిష్కారం కోసం పని చేయాలి. సమస్యలు పరిష్కారం కాకపోతే, పదేపదే అదే అంశంపై కాల్స్ వస్తున్నాయనే అసహనానికి గురి కాకూడదు. టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందనే భరోసా కల్పించేలా వ్యవహరించాలి. లేకుంటే మాత్రం విపక్షాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది.