ఏపీలో అమరావతి రాజధాని రాక నేపథ్యంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ సర్కారు దాఖలుచేసి పిటిషన్ ను గతంలోనే హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఇందులో ఏపీ హైకోర్టు అన్ని పరిశీలించకుండానే ఇన్ సైడర్ ట్రేడింగ్ ను కొట్టేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని ప్రభుత్వన్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు తెలిపారు.
అయితే ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు హైకోర్టు అన్ని విషయాలు పరిశీలించాకే తుది ఉత్తర్వులు ఇచ్చిందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. మరోవైపు అమరావతికి చెందిన మిగిలిన కేసులతో కలిసి విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టును కోరారు. రాజధాని రాకముందే అప్పటి మంత్రులు భూములు కొనుగోలు చేశారని అన్నారు.
హరియాణా భూములపై ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ కేసుపైనా విచారణ చేపట్టాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. అయితే దీనిపై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్ని కొట్టేసిన నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.