
అప్పట్లో ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ ఓ సంచలనం.. ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి ఓ సుప్రీంకోర్టు జడ్జి ప్రయత్నిస్తున్నారని ఏకంగా సుప్రీం చీఫ్ జస్టిస్ బాబ్డేకు జగన్ రాసిన లేఖ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అయితే తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రతిపాదించిన రోజే ఏపీ సీఎం జగన్ కు షాక్ తగిలింది. ఆయన గతంలో చీఫ్ జస్టిస్ కు చేసిన ఫిర్యాదును తాజాగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
అమరావతి భూముల విషయంలో చేసిన ఈ ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం అంతర్గతంగా విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
అమరావతి భూముల విషయంలో ఓ సుప్రీం కోర్టు జ్జడిపై ఏపీ సీఎం జగన్ 2020 అక్టోబర్ 6న సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై అంతర్గతంగా విచారణ జరిపి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణ అత్యంత రహస్యంగా జరిపామని.. ఈ వివరాలు బహిరంగంగా వెల్లడించదగినవి కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
కాగా వచ్చే నెలలోనే ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ ను నియమించాలని స్వయంగా జస్టిస్ బాబ్డే కేంద్రప్రభుత్వానికి ఈరోజు సిఫార్సు చేశారు. ఈ తరుణంలో సీఎం జగన్ ఫిర్యాదును సుప్రీంకోర్టు తోసిపుచ్చడం విశేషం.