
రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా రోజువారి కూలీలు,వివిధ పంటలు పండించే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, గిట్టుబాటు ధరలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఒక రోజు ఉపవాస దీక్ష చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు, నిరసనగా రైతులకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతుల విషయం, కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లపై కనీసం కేబినెట్లో చర్చించకపోవడం దారుణమన్నారు.
లాక్ డౌన్ కాలంలో ఐకేపీకి తెచ్చిన ధాన్యం తిరిగి తీసుకెళ్లాలంటే రైతు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ఎక్కడా ఎలక్ట్రానిక్ కాంటాలు లేవన్నారు. కొన్ని చోట్ల కొనుగోళ్లు ప్రారంభించనే లేదన్నారు. ఈ పరిస్థితులతో రైతులు లాభాలు ఆశించడం లేదని, పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అంటున్నారని, గిట్టుబాటు లేక వారు కన్నీరు పెడుతున్నారన్నారు. రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అంటున్న ప్రభుత్వం ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతు సమన్వయ సమితులు,అధికారులు, మిల్లర్లకు కొమ్ము కాస్తున్నారని, బ్రోకరిజం చేస్తున్నారని ఆరోపించారు.
అందుకే అన్ని జిల్లాల్లో బీజేపీ నేతలు ఒక్క రోజు ఉప వాస దీక్షలో పాల్గొన్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతు సమస్యలు పరిష్కరించాలన్నారు.