
ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో మీడియా కన్నా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడానికి సోషల్ మీడియాదే ప్రధాన భూమిక. ఆ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. సోషల్ మీడియా కార్యకర్తలు వేల సంఖ్యలోనే పనిచేస్తుంటారనే ప్రచారం కూడా ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన ఇతర రాజకీయపార్టీలు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం మొదలు పెట్టాయి. అయితే.. రాజకీయాల్లో సోషల్ మీడియా పవర్ ఏంటనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు.
నల్గొండ–-వరంగల్–-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం. అధికార పార్టీ టీఆర్ఎస్కు ఈ ఎన్నికలు ఎంతటి కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దుబ్బాక జీహెచ్ఎంసీ ఫలితం తర్వాత జారిపోయిన ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. మరోవైపు బీజేపీ కూడా తమ బలం పెంచుకోవడానికి ఈ ఎన్నికపై ప్రధానంగా దృష్టి పెట్టింది. కాంగ్రెస్కు సంప్రదాయ ఓటింగ్ ఉండనే ఉంది. వీరికితోడు రాజకీయ జేఏసీ చైర్మన్గా పనిచేసి తెలంగాణ ఏర్పాటులో తనదైన పాత్ర పోషించిన కోదండరామ్ కూడా ఇక్కడ బరిలో ఉన్నారు.
ఇంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న పోరులో టీవీ యాంకర్ తీన్మార్ మల్లన్న సత్తా చాటుతూ.. అధికార పార్టీతోపాటు ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. ఏ పార్టీ అండా లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్.. కౌంటింగ్లో ప్రధాన పార్టీ పార్టీలను వెనక్కి నెట్టేసి రెండో స్థానంలో కొనసాగుతుండడం రాజకీయ విశ్లేషకులను సైతం నివ్వెరపరుస్తోంది. నల్గొండ-–వరంగల్–-ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకూ రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఈ రెండు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ఆధిక్యంలో నిలిచినప్పటికీ.. అందరి దృష్టీ రెండో స్థానంలో వచ్చిన మల్లన్నపైనే ఉంది.
పల్లాకు 15,857 ఓట్లు రాగా.. తీన్మార్ మల్లన్నకు 12,070 ఓట్లు పోలయ్యాయి. టీజేఎస్ నేత కోదండరాం మూడో స్థానంలో కొనసాగుతుండగా.. తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకునే బీజేపీ ఏకంగా నాలుగో స్థానంలో ఉంది. ఇలాంటి ఫలితాలు వస్తుండడానికి మల్లన్న రాజకీయ నేత కాదు.. ఇప్పటి వరకూ ఆయన ప్రత్యక్షంగా ప్రజలకు చేసింది కూడా ఏమీ లేదు. కానీ.. ఆయన ఒక్కటే చేస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా.. అధికార పార్టీ టీఆర్ఎస్ను ప్రశ్నిస్తున్నాడు. కేసీఆర్ చేస్తున్న రాజకీయ ప్రకటనల్లోని లోపాలను నిలదీస్తున్నాడు. ప్రభుత్వం చేస్తున్న పనుల్లోని లోటుపాట్లను ఎత్తి చూపుతున్నాడు. అదే ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు గెలుపు అంచులకు సైతం చేర్చుతోందే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.