KK survey : కేకే సర్వే లో షాకింగ్ ఫలితాలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీకి దారుణ పరాభవం

ఇటీవల నిర్వహించిన ఏపీ ఎన్నికల్లో కే కే సర్వే షాకింగ్ ఫలితాలను చెప్పింది. ఏపీ ఓటర్ నాడి ముందే పసిగట్టింది. దీంతో ఆ సంస్థకు విశ్వసనీయత పెరిగింది. ఇప్పుడు ఆ సంస్థ దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సంచలన నివేదికను వెల్లడించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 20, 2024 11:01 am

KK Survey

Follow us on

KK survey : త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేకే సర్వే అధినేత కొండేటి కిరణ్ సంచలన ఫలితాలను వెల్లడించారు. అక్కడి ప్రజల నాడిని పసిగట్టి ఆయన కీలక ప్రకటన చేశారు.. ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఘోర ఓటమిని ఎదుర్కొంటుందని కిరణ్ స్పష్టం చేశారు.. అంతేకాదు బిజెపి మునిగిపోతున్న టైటానిక్ ఓడ అని కిరణ్ పేర్కొన్నారు. హర్యానాలో జరిగే ఎన్నికల్లో బిజెపి ఓడిపోతుందని కిరణ్ కుమార్ అన్నారు.. ఆ రాష్ట్రంలో పోటీ చేసే ప్రతి మూడు సీట్లలో రెండు స్థానాల్లో బిజెపి పరాజయాన్ని ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. హర్యానా మాత్రమే కాకుండా త్వరలో జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోని శాసనసభ ఎన్నికల్లో బిజెపి దారుణమైన పరాజయాన్ని ఎదుర్కొంటుందని జోస్యం చెప్పారు. బిజెపి టైటానిక్ షిప్ లాగా మునిగిపోతుందని.. హర్యానాలో బిజెపి ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని కిరణ్ వెల్లడించారు..” బిజెపి ఓడిపోవడమే కాంగ్రెస్ పార్టీకి ఒక సానుకూలత. అలాగని ఆ పార్టీపై ప్రత్యేకమైన సానుకూలత ఓటర్లలో లేదు. బిజెపి ఓడిపోయినప్పటికీ దాని కోర్ ఓట్ బ్యాంకు ఎటూ వెళ్లడం లేదు. న్యూట్రల్ ఓటర్లు మాత్రమే బిజెపిపై ఆదరణ చూపడం లేదు. బిజెపి వ్యతిరేక ఓటు చాలావరకు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తోంది. పోటీలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే ఓటు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తోందని” కిరణ్ వ్యాఖ్యానించారు.

ఆప్ ముందే రంగంలోకి దిగి ఉంటే..

హర్యానా రాష్ట్ర ఎన్నికల్లో ఆప్ ముందే కనుక రంగంలోకి దిగి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని కిరణ్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వడం వల్ల ఎన్నికల్లో పెద్దగా ప్రభావం ఉండదని కిరణ్ పేర్కొన్నారు. హర్యానా రాష్ట్రంలో రైతులు, జాట్ వర్గం వారు బిజెపికి వ్యతిరేకంగా ఉన్నారు. బిజెపి పరిపాలనపై మండిపడుతున్నారు.. హర్యానా ఎన్నికలను రైతులు, జాట్ వర్గం వారు తీవ్రంగా ప్రభావితం చేయగలరని కిరణ్ వివరించారు. హర్యానా రాష్ట్రంలో ఐదు శాతం ఓట్ల తేడాతో బిజెపి చాలా సీట్లను కోల్పోతుందని కిరణ్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా బిజెపి చాలా తక్కువ స్థాయిలో స్థానాలను దక్కించుకుంటుందని స్పష్టం చేశారు. ” ఓటర్లు చాలా స్పష్టతతో ఉన్నారు. వారు తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పూర్తిస్థాయిలో సిద్ధమై ఉన్నారు. గతాన్ని వారు అంచనా వేసుకుంటున్నారు. వర్తమానాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. భవిష్యత్తు కాలాన్ని ఊహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫలితాలు ఎలా వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని” కిరణ్ చెబుతున్నారు.