ఇప్పుడు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా అధికార టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే ఉంది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఊసు మచ్చుకైనా కనిపించడం లేదు. ఎప్పుడో ఆ పార్టీ సైడ్ అయిపోయినట్లుగా అర్థమవుతోంది. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శల దాడికి పాల్పడుతున్నారు. పోటాపోటీగా అస్త్రాలు సంధిస్తున్నారు. మొన్న దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనిపించిన ఈ తంతు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతోంది.
Also Read: యుద్ధం నుంచి.. ఉద్భవించిన మహిళా దినోత్సవం..!
అందుకే.. ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని చెప్పేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేద్దాం రావాలని కేటీఆర్కు సవాల్ చేస్తున్నారు. ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేశారు. టీఆర్ఎస్, బీజేపీది ఆత్మ ఒక్కటే శరీరాలే వేరని.. ఎన్నికలప్పుడు కుస్తీ, తర్వాత దోస్తీ.. ఏడేళ్లుగా చేస్తున్నారని మండిపడ్డారు.
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బీజేపీపై యుద్ధమన్నారు.. తర్వాత ఢిల్లీ వెళ్లి రాజీ పడ్డారని.. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీపై యుద్ధం అంటున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్.. బీజేపీ ఒక్కటి కాకపోతే ఐటీఐఆర్, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం జంతర్ మంతర్ దగ్గర దీక్షకు సిద్ధమా అని సవాల్ చేశారు. దీక్షతో మోదీపై ఒత్తిడి పెంచుదాం.. వస్తారా.. అని సూటిగా ప్రశ్నించారు. ఈ సవాల్పై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని.. దొడ్లో కుక్కలతో మొరిగించే ప్రయత్నం చేయొద్దని కేటీఆర్కు సలహా ఇచ్చారు.
Also Read: ఆ బిల్లు రెండో సారి వెనక్కి..! ఏపీ పెద్దలకు మళ్లీ ఝలక్
తన సవాల్ను స్వీకరించకుంటే మోదీ తొత్తులుగా.. శాశ్వతంగా తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని రేవంత్రెడ్డి తేల్చేశారు. రేవంత్ సవాళ్లపై టీఆర్ఎస్ నేతలు ఇటీవలి కాలంలో స్పందించడం లేదు. బీజేపీ నేతలు ఏమన్నా.. ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తున్నారు. రెండు పార్టీల మధ్య పోరాటం జరుగుతోందన్న భావన కల్పిస్తున్నారు. కానీ.. వారిద్దరూ ఒక్కటేనని రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలు ప్రజలకు ఏ మేరకు చేరుతాయో చూడాలి మరి..!
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్