CM Revanth Reddy: వేట మొదలైంది.. బీఆర్ఎస్ కు షాక్ లిస్తున్న రేవంత్

విద్యుత్ శాఖకు ప్రస్తుతం 85 వేల కోట్ల దాకా అప్పు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి మొన్నటిదాకా ప్రభుత్వం విద్యుత్ శాఖ చెల్లించాల్సిన బకాయిలను దాచిపెట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 8, 2023 1:38 pm

Revanth Reddy

Follow us on

Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా ఆయన క్యాబినెట్ లోని మంత్రులతో కూడా ప్రమాణస్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ ఎదుట నిర్మించిన ఇనుప బారి కేడ్లు నేలమట్టమయ్యాయి. అంతేకాదు ఆరు గ్యారంటీ లపై రేవంత్ రెడ్డి తొలి సంతకం పెట్టారు. 9వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సూచించారు. అనంతరం విద్యుత్ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖకు ఎన్ని అప్పులు ఉన్నాయి? ఎక్కడెక్కడ ఎంత మేర రుణాలు తీసుకొచ్చారు? డిస్కం లు ఏ స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయాయి? గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఎటువంటివి? అనే విషయాల మీద రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే గతంలో విద్యుత్ శాఖ సీఎండీ గా పనిచేసిన దేవులపల్లి ప్రభాకర్ రావు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. అయితే విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి అన్ని ప్రభాకర్ రావు హయాంలోనే జరిగేవి కాబట్టి ఆయన రాజీనామాను ఆమోదించవద్దని ప్రభుత్వ కార్యదర్శిని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

వేల కోట్ల అప్పు

విద్యుత్ శాఖకు ప్రస్తుతం 85 వేల కోట్ల దాకా అప్పు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి మొన్నటిదాకా ప్రభుత్వం విద్యుత్ శాఖ చెల్లించాల్సిన బకాయిలను దాచిపెట్టింది. విద్యుత్ డిస్కం లకు ఉన్న ఆస్తుల కంటే అప్పుడే ఎక్కువ ఉన్నాయని విషయాన్ని ప్రభుత్వం బయటకు రాకుండా జాగ్రత్త పడింది. కాగ్ ఈ విషయాన్ని బయట పెట్టడంతో గత ప్రభుత్వం పదేపదే గొప్పగా చెప్పుకున్న 24 గంటల విద్యుత్ వెనుక చాలా చీకటి కోణం ఉందని తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం సృష్టించేందుకు భారత రాష్ట్ర సమితి అసలు విషయాలు దాచిపెట్టిందని రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ పై సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు సమక్షంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలుకు సంబంధించి శుక్రవారం సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

కాలేశ్వరం అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు

ఇక గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏసీబీ అధికారులకు రాపోలు భాస్కర్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందని, ఇందుకు గత ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, కెసిఆర్ కుమార్తె కవిత, మెఘా కంపెనీ ఎండి కృష్ణారెడ్డి పై ఆయన ఫిర్యాదు చేశారు.. ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని.. ఆయనపై కూడా కేసు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు అంచనాలతో వేల కోట్లు దారి మళ్ళించారని, తాగు, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసు నమోదు చేసి విచారణ జరపాలని న్యాయవాదిని రాపోలు భాస్కర్ కోరారు. కాగా రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అందులో విషయాలు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ పై.

ఇక నిన్నటిదాకా ఆర్మూర్ ఎమ్మెల్యేగా కొనసాగిన జీవన్ రెడ్డి పై కూడా ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఆర్మూర్లో ఆర్టీసీ స్థలాన్ని కొన్ని సంవత్సరాలకు జీవన్ రెడ్డి లీజుకు తీసుకున్నారు. అందులో బహుళ అంతస్తులు నిర్మించారు. వాటిని వివిధ కార్పొరేట్ సంస్థలకు కిరాయికి ఇచ్చారు. అయితే ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. విద్యుత్ శాఖకు కూడా బకాయిలు చెల్లించడం లేదు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్టీసీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. బకాయిలు చెల్లించని పక్షంలో షాపింగ్ కాంప్లెక్స్ కు తాళం వేస్తామని ఆర్టీసీ అధికారులు హెచ్చరించారు. కరెంటు బిల్లులు చెల్లించని నేపథ్యంలో విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రధానంగా దృష్టి సారించారు. భారత రాష్ట్ర సమితికి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.