RBI action on Paytm: భారతీయ డిజిటల్ పేమెంట్స్ రంగాన్ని మార్చివేసిన పేటీఎం ఫిన్టెక్ సంస్థగా ప్రసిద్ధి చెందింది. 2010లో విజయ్శేఖర్శర్మ స్థాపించిన ఈ సంస్థ ప్రారంభంలో మొబైల్ రీచార్జి ప్లాట్ఫార్మ్గా ఉండి, తర్వాత డిజిటల్ వాలెట్ కాన్సెప్ట్ను ప్రజలకు పరిచయం చేసింది. పెద్దనోట్ల రద్దు తర్వాత పేటీఎంకు డిమాండ్ పెరిగింది. కిరాణా షాపులు, ఎటీఎంలు అన్నీ ఈ వాలెట్ ద్వారా చెల్లింపుల కోసం ఉపయోగించడం సాధారణంగా మారింది. అయితే తర్వాత వచ్చిన గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ ఆధారిత సేవలు ప్రజలకు ఎక్కువగా ఆకర్షణీయంగా మారడంతో పేటీఎం పోటీలో వెనుకబడింది. ఇప్పుడు పేటీఎంకు భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్ బీఐ) నుంచి ఒక పెద్ద షాక్ తగిలింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ లైసెన్స్ను రద్దు చేసిన నిర్ణయంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్ బీఐ తీసుకున్న చర్యలు సంచలనం సృష్టించాయి. ఈ నిర్ణయం ప్రజల డిపాజిట్ల భద్రత, బ్యాంకింగ్ రెగ్యులేషన్ల ఉల్లంఘన, మనీ లాండరింగ్ అవకాశాలు వంటి కారణాలను ఆర్బీఐ పేర్కొంది.
బ్యాంక్ లైసెన్స్ రద్దు..
ఆర్ బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు లైసెన్స్ రద్దు చేస్తూ ఫిబ్రవరి 2024లో బ్యాంకింగ్ సేవలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 24 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ పూర్తిగా రద్దు చేసి, బ్యాంకింగ్ కార్యాచరణలను నిషేధించింది. ఆర్బీఐ ఇప్పుడు బ్యాంకును పూర్తిగా మూసే ప్రక్రియకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించింది, డిపాజిట్లు తిరిగి చెల్లించే విషయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై పెట్టిన పరిమితులు ప్రజల కోసం కొట్టివేసింది, అయినప్పటికీ పేటీఎం ముఖ్య పేమెంట్స్ సేవలు (వాలెట్ లేదా యూపీఐ ఇంటిగ్రేషన్) సాధారణంగా పనిచేస్తూ ఉంటాయి. కానీ, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించిన ప్రత్యక్ష బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి.
లైసెన్స్ రద్దుకు ప్రధాన కారణాలు..
ఆర్ బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు ఇటువంటి కఠిన చర్య తీసుకోవడానికి కొన్ని ప్రధాన కారణాలను పేర్కొంది.
– పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ దాని లైసెన్స్కు సంబంధించిన నిబంధనలను నిరంతరం ఉల్లంఘిస్తున్నది. ఆర్బీఐ చేసిన ఆడిట్లలో ఇది స్పష్టమైంది.
– ఖాతాదారుల ధ్రువీకరణ ప్రక్రియలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. కొంత మంది కస్టమర్ల ఖాతాలు కేవైసీ ప్రమాణాలు పాటించకుండానే తెరువబడుతున్నవి.
– పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు 35 కోట్ల ఇ–వాలెట్లు ఉన్నాయి. వాటిలో 31 కోట్ల ఖాతాలు ఇనాక్టివ్ గా ఉన్నాయి. ఈ స్థితి మనీ లాండరింగ్ అవకాశాలను పెంచుతుందని ఆర్ బీఐ అభిప్రాయపడుతుంది.
– ఒకే పాన్ కార్డుతో సుమారు వేల సంఖ్యలో ఖాతాలు అనుసంధానించబడుతున్నాయి. ఇది లావాదేవీల ట్రాక్ చేయడంలో సమస్యలకు దారితీస్తుంది.
– బ్యాంకు పరిపాలన డిపాజిటర్ల ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఆర్బీఐ తెలిపింది.