విశాఖలో ప్రమాదకరమైన స్టెరీన్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు గుంటూరులో ఒక వృద్దురాలిపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. గుంటూరు నగరంలోని లక్ష్మిపురం నగర్ లో నివాసముంటున్న పూదోట రంగనాయకమ్మ తనకు సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టు ను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఇది విశాఖపట్నం ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటనకు సంబంధించి 20 ప్రశ్నలు సంధించారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ సీఐడీ అధికారులు రంగనాయకమ్మపై సెక్షన్ 41(ఏ) కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి, పూచీకట్టుపై విడుదల చేశారు.
ఈ సందర్భంగా రంగనాయకమ్మ మీడియాతో మాట్లాడుతూ తాను కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోస్ట్ పెట్టలేదని, తనకు వచ్చిన పోస్టు చూసి ప్రజలు మోటివేట్ అవుతారని మాత్రమే పోస్టు చేశానని చెప్పారు. ఇది యాదృచ్చికంగా చోటుచేసుకున్న సంఘటన అని చెప్పారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా, టిడిపి నాయకులు చిట్టిబాబు తదితరులు రంగనాయకమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించారు. టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు.