Ramoji Rao : ఎటు వీలైతే అటు.. ఇదే రామోజీ కనికట్టు

నచ్చితే ఒకలా.. నచ్చకపోతే మరోలా కంటెంట్ మార్చి రాయగల నేర్పరితనం రాజగురువు పత్రిక సొంతం. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. కల్పితంతో కనికట్టు చేయగల సాహసం కూడా ఆయనదే. తెలుగు జర్నలిజంలో అగ్రస్థానంలో కొనసాగుతూ.. అదే జర్నలిజం విలువలను దిగజార్చడానికి కూడా వెనుకాడని వైనం అందరికీ తెలిసిందే.

Written By: Dharma, Updated On : July 1, 2023 10:24 am
Follow us on

Ramoji Rao : గురివింద గింజ సామెతలా ఉంటాయి రామోజీ ఈనాడు రాతలు. నచ్చితే ఒకలా.. నచ్చకపోతే మరోలా కంటెంట్ మార్చి రాయగల నేర్పరితనం రాజగురువు పత్రిక సొంతం. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. కల్పితంతో కనికట్టు చేయగల సాహసం కూడా ఆయనదే. తెలుగు జర్నలిజంలో అగ్రస్థానంలో కొనసాగుతూ.. అదే జర్నలిజం విలువలను దిగజార్చడానికి కూడా వెనుకాడని వైనం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా తన అడుగులకు మడుగులు ఒత్తాలని పరితపించే మనస్తత్వం రామోజీరావుది. అంతిమంగా మాత్రం చంద్రబాబుకి శ్రేయస్కరంగా ఉండాలి. ఆయన బాగుండాలి. ఆయన బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రజలను నమ్మించాలి. ఇందు కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు రాజీపడరు మన రాజగురువు రామోజీరావు.

ఆ మధ్యన బాలక్రిష్ణ నటించిన లెజెండ్ గుర్తుంది కదూ.ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్.. నేను ఎదురెళ్లినా వాడికే రిస్క్. బాలక్రిష్ణ బలంగా చెప్పే డైలాగు ఇది. రామోజీరావుకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎక్కడో పచ్చళ్ల వ్యాపారంలో అడుగుపెట్టి.. తరువాత ముద్రణ రంగంతో రాటుదేలి తెలుగు రాజకీయాలను శాసిస్తూ వచ్చారు రామోజీరావు. మీడియో మొఘల్ గా అవతరించి రాష్ట్ర రాజకీయాలను బాగా వంటపట్టించుకున్నారు. ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తి.. అదే ఎన్టీఆర్ ను పాతాళానికి తోసేశారు. అటువంటి రాజగురువుకు ఫస్ట్ టైమ్ రాజశేఖర్ రెడ్డి బ్రేకులు వేయగలిగారు. ఇప్పుడు జగన్ ఎదురెళ్లి ఇబ్బందులు పెడుతున్నారు.

అదే సమయంలో జగన్ కు సైతం రామోజీ అదే స్థాయిలో ఢీకొడుతున్నారు. తనకున్న మీడియాతో గట్టిగానే ఎదుర్కొంటున్నారు. చంద్రబాబుకు పూర్వ వైభవం కల్పించాలని తహతహలాడుతున్నారు. జగన్ సర్కారుపై విషపు రాతలతో రెచ్చిపోతున్నారు. బలమైన కథనాలతో దడ పుట్టిస్తున్నారు. అయితే ఈ క్రమంలో చంద్రబాబు అనుకూల కథనాలతో రోతపుట్టిస్తున్నారు. కృష్ణా నది కరకట్టలపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని తొలగించేందుకు జగన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మే 15న ఆ ఇంటిని జప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. అప్పుడు ఈనాడులో చంద్రబాబు నివాసం జప్తు అని కథనం వచ్చింది. అదే ఇంటి జప్తునకు ఈ రోజు కోర్టు నోటీసు జారీచేసింది. ఇప్పుడు అదే ఈనాడు లింగమనేని ఇంటి జప్తు అని కథనం ప్రచురించింది. దీంతో రాజగురువు రాతల వేర్యేషన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు వెలుస్తున్నారు. తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు పెడుతున్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు క్విడ్ ప్రోకు పాల్పడ్డారన్నది జగన్ సర్కారు ఆరోపణ. అమరాతి రాజధాని భూముల విషయంలో లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించారని.. చాలారకాలుగా లబ్ధి చేకూర్చారని.. అందుకే కృష్ణానదిపై తన అభిరుచికి తగ్గట్టుగా నిర్మించుకున్న గెస్ట్ హౌస్ చంద్రబాబుకు ఇచ్చారని వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణమని జగన్ సర్కారు జప్తునకు ఆదేశించింది. తరువాత ఇది కోర్టు పరిధిలోకి వెళ్లడంతో కోర్టు కూడా అదే నోటీసులు జారీచేసింది. కానీ ఈనాడు పత్రిక మాత్రం విభిన్నంగా స్పందించింది. తనకున్న రోత విధానాన్ని బయపెట్టుకుంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కైంది.