Homeజాతీయ వార్తలుమోదీ మార్క్.. ఇక ఆ ప్రభుత్వాల ఆటలు చెల్లవు..

మోదీ మార్క్.. ఇక ఆ ప్రభుత్వాల ఆటలు చెల్లవు..

NCT Of Delhi
ప్రజల చేత.. ప్రజలకోసం.. ప్రజలే ఎన్నుకునేది భారత ప్రజాస్వామ్యం. అయితే ఈ అర్థాన్ని ఇప్పుడున్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మార్చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలను డమ్మీలను చేస్తూ.. కొత్త చట్టం తీసుకువచ్చింది. ముందుగా ఢిల్లీకే ఈ చట్టం అన్వయిస్తున్నప్పటికీ.. తరువాత దేశం మొత్తం విస్తరించడానికి ఇదో గొప్ప అవకాశంగా ఉపయోగపడుతుంది. ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అన్న అర్థం వచ్చేలా కొత్త చట్టం తీసుకుని వచ్చారు.

‘‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ.. 2017’’ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. అంటే.. ఢిల్లీ ప్రజాస్వామ్యాన్ని ఇక నామమాత్రం చేశారన్న మాట. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టేలా లెఫ్టినెంట్ గవర్నర్లకు అధికారులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త చట్టాల ద్వారా అసలు ప్రభుత్వం అంటేనే లెఫ్టినెంట్ గవర్నర్ అన్న నిర్వచనం మార్చేశారు. ఇకనుంచి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పాలనాధికారే. ప్రభుత్వ రోజూవారి వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది.

అంటే ఇక ప్రజా ప్రభుత్వం దాదాపు నిర్వీర్యం అయిపోయినట్లే అన్నమాట. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటే సమస్య ఉత్పన్నం కాదు. ఢిల్లీలో ఆప్ సర్కారు ఉంది. కేంద్రంలో బీజేపీ సర్కారు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారానే బీజేపీ పరిపాలన చేస్తుంది. ఇప్పుడు జరగబోయేది అదే. అసలు విషయం ఏంటంటే.. ఈ బిల్లును ఒక్క బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు వ్యతిరేకించాయి.దీంతో రాజ్యసభలో పాస్ కాదని అందరూ అనుకున్నారు. బీజేడీ, వైసీపీ పార్టీలు బిల్లుపై తీవ్ర విమర్శలు చేశాయి.

వైసీపీ విజయసాయిరెడ్డి అయితే.. తరువాత లెఫ్టినంట్ అనే పదం తీసేసి గవర్నర్ ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను నడుపుతారా.. అని విరుచుకుపడ్డారు. ఆయన ఆవేశం చూసి.. వ్యతిరేకంగా ఓటు వేస్తారేమో అనుకున్నారు. కానీ వాకౌట్ చేసి .. బీజేపీకి ఉన్న నెంబర్లతోనే బిల్లు పాసయ్యేలా సహకరించారు. దీంతో ఏం జరుగుతుందో తెలిసి కూడా… ప్రజాస్వామ్యానికి ద్రోహం చేశారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version