కాంగ్రెస్‌ కార్యకర్తలకు గుడ్‌ న్యూస్‌

ఆఖరి వెలుతురులో ఉన్న కాంగ్రెస్‌కు ఓ బూస్టింగ్‌ లాంటి వార్త లభించింది. ఇప్పటికే వలసలు.. గ్రూపు రాజకీయాలతో రచ్చకెక్కుతున్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా ఉంది. పార్టీని నడిపించే సరైన బాస్‌ లేక.. పార్టీ సీనియర్లే నిరసన గళం వినిపించారు. ఇప్పటివరకు ఏఐసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియాకు ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో ఆమె కొడుకు రాహుల్‌ ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని ఎప్పటినుంచో ఒత్తిడి ఉంది. ఆ మధ్య 2019 ఎన్నికలకు ముందు ఏఐసీసీ బాధ్యతలు […]

Written By: Srinivas, Updated On : December 1, 2020 10:19 am
Follow us on


ఆఖరి వెలుతురులో ఉన్న కాంగ్రెస్‌కు ఓ బూస్టింగ్‌ లాంటి వార్త లభించింది. ఇప్పటికే వలసలు.. గ్రూపు రాజకీయాలతో రచ్చకెక్కుతున్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా ఉంది. పార్టీని నడిపించే సరైన బాస్‌ లేక.. పార్టీ సీనియర్లే నిరసన గళం వినిపించారు. ఇప్పటివరకు ఏఐసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియాకు ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో ఆమె కొడుకు రాహుల్‌ ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని ఎప్పటినుంచో ఒత్తిడి ఉంది. ఆ మధ్య 2019 ఎన్నికలకు ముందు ఏఐసీసీ బాధ్యతలు తీసుకున్నా.. ఆ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Also Read: కేంద్ర మంత్రుల ప్రచారంతో బీజేపీకి లాభమైందా?

అప్పటి నుంచి.. ఏఐసీసీ బాధ్యతలు సోనియా నడిపిస్తున్నా ఆ బాధ్యతలు రాహుల్‌ తీసుకోవాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. అందుకు ఆయన ససేమిరా అంటూ వస్తున్నారు. అయితే.. తాజాగా ఆ బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్‌ ఒప్పుకున్నాడట. ఇక వేరే గత్యంతరం లేకపోవడంతో రాహుల్‌ అయిష్టంగానే అధ్యక్ష పదవిని చేపట్టేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏఐసీసీ సమావేశం ఏర్పాటు చేసి అందులో రాహుల్ గాంధీ నాయకత్వంపై స్పష్టత ఇచ్చేందుకు అధినాయకత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు వివిధ రాష్ట్రాల పార్టీ శాఖలకు పార్టీ నేత మధుసూదన్ మిస్త్రీ లేఖ రాయడం ఇందుకు నిదర్శనం.

2019 పార్లమెంటు ఎన్నికలలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి ఆయన పదవికి దూరంగా ఉన్నారు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి నాయకత్వం లేదు. ఈ ప్రభావం బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ ఉప ఎన్నికలపై కూడా పడినట్లు అధిష్టానం అభిప్రాయం. అయితే గాంధీ కుటుంబం తప్ప కాంగ్రెస్ పార్టీకి వేరే దారిలేదు.

Also Read: రజనీ రాజకీయ అరంగేట్రం.. మళ్లీ అదే సస్పెన్స్

తాను పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పుడు కూడా రాహుల్ గాంధీ వేరొకరు బాధ్యతలను చేపట్టాలని కోరారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. గాంధీ కుటుంబాన్ని కాదని ఆ పదవిని చేపట్టినా ప్రయోజనం లేదని భావించి ఎవరూ పదవిని తీసుకునేందుకు ఇష్టపడలేదు. అయితే సీనియర్ నేతలు మాత్రం పార్టీకి పూర్తికాలం నాయకత్వం కావాలని గట్టిగా కోరుతున్నారు. ఎన్నికల్లో ఓటమి అలవాటయిన కాంగ్రెస్ పార్టీకి రానున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో అయినా పరువు నిలబెట్టుకోవాలంటే పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని భావిస్తోంది. రాహుల్ గాంధీ కూడా కొంత దిగివచ్చినట్లే కనిపిస్తోంది. మొత్తం మీద మళ్లీ రాహుల్ అధ్యక్ష పదవి చేపడితే కొంతలో కొంతైనా కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతుందేమో చూడాలి మరి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్