Homeఆంధ్రప్రదేశ్‌జగన్ ను జైలుకు పంపించే రఘురామ పంతం?

జగన్ ను జైలుకు పంపించే రఘురామ పంతం?

MP Raghuram Krishnam Raju

ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు అయిపోయింది పాపం ఏపీ సీఎం జగన్ పరిస్థితి. ఎంపీగా టికెట్ ఇచ్చి.. గెలిపించిన పాపానికి ఇప్పుడు జగన్ అనుభవిస్తున్నాడు. మంచి పదవిని ఇచ్చి అనుభవించుకో.. పాలించుకో అంటే ఆ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మాత్రం జగన్ కే పక్కలో బల్లెంలా మారారు. ఎక్కడ మొదలైందో వివాదం కానీ ఇప్పుడు వీరిద్దరికి ఒకరంటే ఒకరికి అస్సలు పడడం లేదు. అది ఎంతదాకా వెళ్లిందంటే ఇప్పుడు జగన్ కాళ్ల కింద కూర్చీ లాగేసేదాకా వెళ్లిపోయింది.

ఏపీ సీఎం జగన్ ను పగబట్టాడు నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. మొదట ఈయన వైసీపీ ఎంపీగా ఢిల్లీకి వెళ్లి కొద్దిరోజులుగా బాగానే ఉన్నారు. కానీ బీజేపీ సర్కార్ ఆయనకు పార్లమెంటరీ కమిటీల్లో చోటు ఇవ్వడంతో ఒక్కసారిగా మారిపోయారు.  కమలదళం వైపు మళ్లారు. తోటి వైసీపీ ఎంపీలను , జగన్ ను లెక్కచేయలేదు. మోడీ, అమిత్ షాలతో సాన్నిహిత్యం నెరిపి వైసీపీకి దూరమయ్యారు.

అయితే వైసీపీ ఊరుకుందా? ఆయన ఎంపీ సీటుకు ఎసరు తెచ్చేలా పార్లమెంట్ లోని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఏదో లూప్ హోల్ కింద ఎంపీగా అనర్హుడిని చేయమని వైసీపీ కోరింది. నర్సాపురం వస్తే అవమానించింది. పలు కేసులు పెట్టించింది. దీంతో వీరిద్దరి వైరం పతాక స్థాయికి చేరింది.

అయితే ఆ మధ్య పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఎంపీ రఘురామ విద్యుత్ ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లను అధిక ధరకు జగన్ కొనమంటే కొనలేదని.. అప్పుడు మొదలైన వివాదమే చిలికి చిలికి పెద్దది అయ్యిందనే ప్రచారం ఏపీ రాజకీయవర్గాల్లో ఉంది.

మధ్యలో టీడీపీ మీడియా రఘురామను హీరోను చేసి ఊరేగించింది. ఇప్పుడు రఘురామ ఏకంగా సీఎం జగన్ ను వెంటాడుతున్నారు. ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోర్టుకు ఎక్కారు.

ఇదివరకే ఒకసారి జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటీషన్ వేస్తే సరిగా లేదని సీబీఐ కోర్టు  వెనక్కి పంపింది.   ఇప్పుడు మరోసారి ఎంపీ రఘురామ పక్కాగా పిటీషన్ తో కోర్టును ఆశ్రయించారు. ట్విస్ట్ ఏంటంటే ఈసారి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ఈ పిటీషన్ ను స్వీకరించింది. జగన్ సీఎంగా ఉండి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ స్వీకరించిన కోర్టు దీనిపై సీఎం జగన్ కు, సీబీఐకి నోటీసులు ఇవ్వనుంది.

జగన్ బెయిల్ కనుక రద్దు చేస్తే జగన్ కుర్చీ గల్లంతవ్వడం ఖాయం. మరి ఈ విషయంలో కోర్టు ఏం నిర్ణయిస్తుంది? జగన్ పదవికి ఎసరొస్తుందా? అన్న ఆందోళన ఇప్పుడు వైసీపీ శ్రేణులకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రశాంతంగా పాలిస్తున్న జగన్ కు ఈ పరిణామం ఒకింత కలవరపాటుకు గురిచేసేలానే ఉంది. ఎంపీ రఘురామ పేరు చెబితేనే వైసీపీ శ్రేణులు ఊగిపోతున్న పరిస్థితి నెలకొంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version