Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: షర్మిల చుట్టూ రాజకీయం.. మనకు నచ్చకపోతే జెండా పీకేశారనాలి.. నచ్చితే చేరుతున్నారని రాయాలి

YS Sharmila: షర్మిల చుట్టూ రాజకీయం.. మనకు నచ్చకపోతే జెండా పీకేశారనాలి.. నచ్చితే చేరుతున్నారని రాయాలి

తెలుగు నాట అత్యధిక సర్కులేషన్ కలిగి ఉన్న ఓ పత్రిక.. తనకు ఉండే రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగానే రాతలు రాస్తూ ఉంటుంది. కాకపోతే వీటిని పాఠకులకు తీపి పొట్లంలో పెట్టి ఇస్తుంది. అది తరచి చూసి.. అందులో ఏముంది అని ఆత్రుతగా చదివితే.. అప్పటికే అది ఎక్కాల్సిన స్థాయిలో ఎక్కేస్తుంది.

YS Sharmila: పాత్రికేయమనేది ఒక భిన్నమైన వృత్తి. సమాజంలో జరుగుతున్న సంఘటనలను జన బాహుళ్యం అనే కోణంలో చూడటమే ఆ వృత్తి ప్రధాన లక్షణం. కానీ రాను రాను అది ప్రయోజనాల కోసమే.. ఆస్తులను కూడగట్టుకునేందుకే అన్నట్టుగా మారిపోతుంది. యాజమాన్యాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా పాత్రికేయాన్ని మలచడంతో అసలు దానిమీద ప్రజలకు ఉన్న నమ్మకం కూడా పోతుంది.. వెరసి మీడియా అంటేనే డప్పు కొట్టే మాధ్యమం అనే స్థాయికి పడిపోతోంది. అయితే ఈ సమయంలో కొద్దిగా గొప్పో విలువలు పాటించాల్సిన తరుణంలోనూ సొంత ప్రయోజనాల కోసమే యాజమాన్యాలు పెద్దపీట వేస్తుండడం, తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా పాత్రికేయాన్ని మలచడం.. వంటి పరిణామాలు వ్యవస్థను మరింత పతనం చేస్తున్నాయి.

తెలుగు నాట అత్యధిక సర్కులేషన్ కలిగి ఉన్న ఓ పత్రిక.. తనకు ఉండే రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగానే రాతలు రాస్తూ ఉంటుంది. కాకపోతే వీటిని పాఠకులకు తీపి పొట్లంలో పెట్టి ఇస్తుంది. అది తరచి చూసి.. అందులో ఏముంది అని ఆత్రుతగా చదివితే.. అప్పటికే అది ఎక్కాల్సిన స్థాయిలో ఎక్కేస్తుంది. ఇది తప్పు అని అనుకునే లోపు ఆ పత్రిక లక్ష్యం నెరవేరుతుంది. దానిని బెరీజు వేసుకునే నాటికి ఎదుటివారికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. గతంలో సీనియర్ ఎన్టీఆర్ కాలంలో కాంగ్రెస్ పార్టీకి, సీనియర్ ఎన్టీఆర్ ను దింపేటప్పుడు, పోటీ పత్రికలను తుంగలో తొక్కడానికి, చంద్రబాబు కాలంలో కాంగ్రెస్ పార్టీకి, ఆ పత్రిక చేసిన నష్టం అంతా ఇంతా కాదు. అంతేకాదు తనకు పోటీగా ఎదుగుతున్న వివిధ యాజమాన్యాలకు సంబంధించి ఆర్థిక మూలాల మీద ఆ పత్రిక రాసిన రాతలు కూడా మామూలువికావు. చివరికి ఉద్యమాలను కూడా తనకు అనుకూలంగా మలచుకున్న నైజం ఆ పత్రిక సొంతం.. అందుకే పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలు అని శ్రీ శ్రీ అన్నారేమో. బహుశా దానిని ఈ పత్రికను చూసి రాశారేమో..

ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు.. ఆ తర్వాత దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు చిరంజీవి మీద ఆ పత్రిక రాసిన రాతలు మామూలువి కాదు.. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఈ పార్టీ పరిణమిస్తుందని భావించి అడ్డగోలుగా రాతలు రాసింది. వ్యక్తిగతంగా విషం కూడా చిమ్మింది. హలో చిరంజీవి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమిటి అనే ప్రశ్నను కూడా లేవనెత్తింది.. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నప్పుడు జెండా పీకేద్దాం అనే స్థాయిలో వార్తను రాసింది. ఆ తర్వాత ప్రస్తుత కాలానికి వస్తే.. వైయస్ షర్మిల తాను స్థాపించిన పార్టీని కాంగ్రెస్లో నేడు విలీనం చేస్తున్నారు. అధికారికంగా ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సారధ్య బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇలాంటప్పుడు సహజంగానే ఆ పత్రిక తన సహజ ధోరణిలో వార్తలు రాస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు షర్మిల ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించడం చంద్రబాబు నాయుడుకి అత్యంత అవసరం, జగన్మోహన్ రెడ్డికి అది ప్రతి బంధకం అవుతుందని భావించి.. ఆ పత్రిక చాలా సానుకూలంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం అని చాలా సులువుగా రాసింది. అంటే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ, ఇప్పుడు షర్మిల పార్టీ విలీనం అవుతుంది కాంగ్రెస్ పార్టీలోనే. కానీ అప్పుడు ఆ పత్రిక స్పందించిన తీరుకు.. ఇప్పుడు రాస్తున్న తీరుకు అస్సలు సంబంధమే లేదు. అయితే ఇక్కడ తనకు ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ఆ పత్రిక రెండు విధాలుగా వార్తలను రాసింది. మరి అలాంటప్పుడు మాకు ఎలాంటి పక్షపాతం లేదని.. అన్ని పార్టీలు తమకు ఒకటేనని ఆ యాజమాన్యం ఎలా చెప్పుకుంటుంది.. తమకు నిష్పక్షపాతమైన జర్నలిజం మాత్రమే తెలుసు అని ఎలా ఉంటుంది.. ఇక ఆ పత్రిక అప్పుడు రాసిన రాతలను.. ఇప్పుడు రాస్తున్న రాతలను బేరిజు వేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటున్నారు. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper