హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా సూచించిన వ్యక్తులు నియమాలను ఉల్లంఘిస్తూ యధేచ్చగా లాక్డౌన్ నియమాలు పాటించకపోతే కరోనా వైరస్ డేంజర్ నుంచి మనల్ని కాపాడుకోవడం చాలా కష్టతరమౌతుందని హెచ్చరించారు. ఎటువంటి లక్షణాలు లేనప్పటికి స్వీయ క్వారంటైన్ను పాటిస్తున్న వారికి ప్రధాని అభినందనలు తెలిపారు.
కరోనాపై యుద్ధంలో ఇటువంటి కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొంటూ భారత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం అతి ముఖ్యమని చెప్పారు. లక్ష్మణరేఖను ప్రజలు మరికొన్ని రోజులు పాటించాలని కోరారు.
కరోనాపై వైద్యులు, నర్సులు, సిబ్బంది నిరంతరం పోరాడుతున్నారని ప్రధాని కొనియాడారు. ఏ విధమైన భౌతిక ప్రతిఫలం ఆశించకుండా రోగులకు సేవ చేసే వైద్యుడే అత్యుత్తమ వైద్యుడని ఆచార్య చరకుడు చెప్పారని గుర్తు చేస్తూ ఇటువంటి సేవాభావంతో పనిచేస్తున్న ప్రతి నర్సుకు వందనం చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
ప్రపంచం 2020ని నర్సుల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటోందని చెబుతూ వీరందరూ సాటిలేని అంకితభావంతో పనిచేస్తున్నట్లు మోదీ కొనియాడారు. కరోనాపై పోరాటంలో నర్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ముందువరుసలో ఉన్నారని ప్రశంసించారు.
కరోనా ఏ ఒక్క ప్రాంతానికో,ప్రదేశానికో పరిమితం కాలేదని, ఇంకా కొందరు సీరియస్ గా తీసుకోవట్టేదని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. వైరస్ కు పేద,ధనిక తేడా లేదని చెబుతూ కరోనాపై చేస్తున్న యుద్దంలో గెలవాల్సిందేనని స్పష్టం చేశారు.