కేంద్రంలోని బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి మైనస్లా మారుతున్నాయా..? అందుకే.. ఆ పార్టీకి రోజురోజుకూ గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయా..? ఎన్నికల్లో ఈ స్థాయిలో శ్రమించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది..? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు వెతుక్కునే పరిస్థితికి వచ్చింది బీజేపీ. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి సవాల్గా మారాయి.
ఇప్పుడు జరుగుతున్న ఈ ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా బీజేపీకి అనుకూలంగా లేదు. ఎక్కడా బీజేపీకి ఛాన్స్ కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఒపీనియన్ పోల్స్లో స్పష్టమవుతోంది. పశ్చిమ బెంగాల్లో కొద్దో గొప్పో ఆశలు పెట్టుకున్నా అది కూడా నెరవేరే అవకాశం కన్పించడం లేదు. బీజేపీకి మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలే అండగా ఉంటూ వస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీకి పట్టు ఎక్కువగా ఉంది. అయితే.. కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ విజయానికి అడ్డంకిగా మారనున్నాయి.
ముఖ్యంగా పెట్రోలు ఉత్పత్తుల ధరలు పెరగడంపై సోషల్ మీడియాలో మోదీపై దారుణమైన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేంటని ప్రశ్నిస్తున్నారు. నోట్ల రద్దు నుంచి జీఎస్టీ వరకూ అన్నీ ప్రజలను పీడించేవే అయినప్పుడు మోదీ పార్టీకి ఎందుకు మద్దతివ్వాలన్న కామెంట్స్ బలంగానే వినిపిస్తున్నాయి. పెట్రోలు ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు బీజేపీకి దాదాపుగా దూరమయ్యారు. ఈ ప్రభావం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఖచ్చితంగా కనిపిస్తుందని చెబుతున్నారు.
మోడీ ఆడించినట్లుగా ఆడితే.. దేశాన్నే అమ్మేస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు. వరుస విజయాలతోనే ఈ దుస్థితి వచ్చిందని.. అందుకే.. ఆ విజయాలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం మొదలు పెట్టారు. రైల్వేలను కూడా ప్రైవేటు పరం చేయాలన్న యోచనలో ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ప్రజలు కూడా ఆలోచనలో పడిపోయారు. వీటన్నింటి నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అంత సానుకూల పవనాలు వీచే అవకాశాలు లేవనే తెలుస్తోంది.