BRS MLAs: ప్రత్యర్థుల సవాల్.. ఆ 24 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏమిటో?

ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన 24 మంది ఎమ్మెల్యేలపై వారి సమీప ప్రత్యర్ధులు ఎలక్షన్ పిటిషన్లు దాఖలు చేశారు. భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై కూడా ఈ పిటిషన్లు దాఖలు కావడం విశేషం.

Written By: Anabothula Bhaskar, Updated On : January 29, 2024 3:22 pm
Follow us on

BRS MLAs: విజయం, అపజయం.. ఈ రెండు పదాలు ఒకే తీరుగా ఉన్నప్పటికీ.. విజయం ముందు “అ” ను చేర్చితే చాలు దాని అర్థమే మారిపోతుంది. అందుకే ఎన్నికల్లో విజయం కోసం మాత్రమే అభ్యర్థులు పోటీ చేస్తారు. పరిస్థితిలో ఆ విజయం ముందు “అ” అనే పదాన్ని చేర్చుకునేందుకు అస్సలు ఇష్టపడరు. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులకు విజయం ముంగిట “అ” అనే అక్షరం వచ్చి చేరింది. ఫలితంగా వారి మొహంలో కళ తప్పింది. పరాజితులుగా మిగిలి పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వారికి మరో అవకాశం వచ్చింది. అది రాజకీయంగా సంచలనానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది.. ఇంతకీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే..

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. విజయవంతంగా నెల పాలన పూర్తి చేసుకుంది. రెండవ నెల కూడా పూర్తిచేసుకునేందుకు మరికొద్ది రోజుల దూరంలోనే ఉంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి రాజకీయంగా కూడా వాతావరణం అంత వేడిగా లేదు. కేటీఆర్, హరీష్ రావు వంటి భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపణలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ వైపు నుంచి పెద్దగా కౌంటర్ లేదు..సో మొత్తానికి మీడియాకు కూడా మసాలా అందించే వార్తలు లేవు. కానీ ఓ 24 మంది ఎమ్మెల్యేలపై వారి ప్రత్యర్థులు ఆరోపణలు చేయడం.. వారి గెలుపును రద్దు చేయాలనడం.. ఫలితంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కుదుపు ప్రారంభమైంది.. అంతేకాదు ఏకంగా రిజిస్ట్రీ పరిశీలనలో 30 దరఖాస్తులు ఉండటం సంచలనం రేకిత్తిస్తోంది.. అయితే ఇందులో కేటీఆర్, హరీష్ రావు పై కూడా పిటిషన్లు దాఖలు కావడం విశేషం.

ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన 24 మంది ఎమ్మెల్యేలపై వారి సమీప ప్రత్యర్ధులు ఎలక్షన్ పిటిషన్లు దాఖలు చేశారు. భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై కూడా ఈ పిటిషన్లు దాఖలు కావడం విశేషం. ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలపై ఏకంగా రెండు పిటిషన్లు దాఖలు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఫలితంగా రిజిస్ట్రీ పరిశీలనలో పిటిషన్ 30 కి చేరుకుంది. ఆ ఎమ్మెల్యేల ఎన్నిక అక్రమమని, తమన విజేతలుగా ప్రకటించాలని పిటిషన్లు కోరుతుండడంతో తెలంగాణలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఈ పిటిషన్లు రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగా.. వరకు ఇంకా దేనికీ రిజిస్ట్రీ రెగ్యులర్ నెంబర్ కేటాయించకపోవడం విశేషం. ప్రజా ప్రతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ఫలితాలు వచ్చిన 45 రోజుల్లో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ గడువు ఇటీవల ముగిసింది. ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం, ఈవీఎంలు, వీవీ ప్యాట్లలో లోపాలను పేర్కొంటూ పిటిషనర్లు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేటీఆర్ పై ఆయన సమీప ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తన కుమారుడు హిమాన్షురావును డిపెండెంట్ గా చూపించలేదని, తప్పుడు ఆఫిడవిట్ చూపించారని పిటిషన్ లో పేర్కొన్నారు. హిమాన్షు రావు పేరుతో 32 ఎకరాల భూమి ఉందని.. దీనిని కొనుగోలు చేసేందుకు ఆయనకు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో కేటీఆర్ వెల్లడించలేదని మహేందర్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ భూమి సేల్ డీడ్ కూడా మహేందర్ రెడ్డి సమర్పించారు. అంతేకాదు అమెరికాలో చదువుతున్న హిమాన్షురావుకు కేటీఆరే ఫీజు కడుతున్నా డిపెండెంట్ గా చూపలేదని పిటిషన్ లో ప్రస్తావించారు. అంతేకాదు కేటీఆర్ తన కొడుకు అప్పుడే వీటిలో చూపలేదని మరో పిటిషన్ కూడా దాఖలైంది.

ఇక భారత రాష్ట్ర సమితికి చెందిన మరో కీలక నేత, ఎమ్మెల్యే హరీష్ రావు పై కూడా మరో పిటిషన్ దాఖలయింది. బీఎస్పీ నుంచి పోటీ చేసిన చక్రధర్ గౌడ్ హరీష్ రావు పై పిటిషన్ దాఖలు చేశారు. ఇక కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పై కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి కృష్ణారావు తోపుడు బండ్లు పంపిణీ చేశారని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారని బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, నవీన్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ అభ్యర్థి సరిత పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు 2018 ఎన్నికలకు సంబంధించిన ఈపీలో ఆయన అనర్హతకు గురయ్యారని, ఆ విషయాన్ని ఇటీవల ఎన్నికల అక్కడ ఆఫిడవిట్లో పేర్కొనలేదని ఆమె ప్రస్తావించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోబా లక్ష్మికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి శ్యాం నాయక్ పిటిషన్ దాఖలు చేశారు. పటాన్చెరువు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఆదిలాబాద్, కామారెడ్డి, కొత్తగూడెం, షాద్ నగర్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యేలపై సైతం ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు ఇప్పటికే హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అప్పటి ఎన్నికలకు సంబంధించి కొత్తగూడెం, గద్వాల ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం విశేషం. వీటిపై వారు సుప్రీంకోర్టు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.