Pawan kalyan: పవన్ విశాఖ ‘ఉక్కు’ పోరాటం.. వైసీపీ మీదా? బీజేపీ మీద కాదా?

Pawan kalyan: ‘ఇల్లాలు ఏడ్చింది మొగుడు కొట్టినందుకు కాదట.. తోటి కోడలు నవ్వినందుకట..’ ఇప్పుడు ఇలానే ఉంది ఏపీ రాజకీయాల పరిస్థితి. చేసేది ఒకరు.. చేయించేది ఒకరు.. విమర్శలు మాత్రం మరొకరిపై.. అసలు ఏంటీ పక్షపాత రాజకీయాలో అర్థం కావడం లేదు.. విశాఖ ఉక్కు రగలడానికి అసలు కారణం కేంద్రంలోని బీజేపీ సర్కార్. ప్రైవేటీకరణలో భాగంగా ఏపీ ప్రజలు, పార్టీలు ఎంత మొత్తుకుంటున్నా తగ్గేదేలే అన్నట్టుగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామంటూ స్పష్టంచేస్తోంది. ఎంత ఒత్తిడి చెప్పినా […]

Written By: NARESH, Updated On : November 1, 2021 10:17 am
Follow us on

Pawan kalyan: ‘ఇల్లాలు ఏడ్చింది మొగుడు కొట్టినందుకు కాదట.. తోటి కోడలు నవ్వినందుకట..’ ఇప్పుడు ఇలానే ఉంది ఏపీ రాజకీయాల పరిస్థితి. చేసేది ఒకరు.. చేయించేది ఒకరు.. విమర్శలు మాత్రం మరొకరిపై.. అసలు ఏంటీ పక్షపాత రాజకీయాలో అర్థం కావడం లేదు.. విశాఖ ఉక్కు రగలడానికి అసలు కారణం కేంద్రంలోని బీజేపీ సర్కార్. ప్రైవేటీకరణలో భాగంగా ఏపీ ప్రజలు, పార్టీలు ఎంత మొత్తుకుంటున్నా తగ్గేదేలే అన్నట్టుగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామంటూ స్పష్టంచేస్తోంది. ఎంత ఒత్తిడి చెప్పినా మాట వినడం లేదు.. స్వయంగా పార్లమెంట్ లో అడిగినా ప్రైవేటీకరిస్తామంటూ ఓపెన్ గా చెప్పేసింది. అధికార వైసీపీని, ప్రతిపక్షాల ఆందోళనను లైట్ తీసుకుంది. పట్టించుకోవడం లేదు.

pawan-kalyan jagan modi

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అధికార వైసీపీ ఖండించింది. విశాఖ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు స్వయంగా రోడ్డెక్కారు. సీఎం జగన్ దీనిపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ప్రతిపక్ష నేత చంద్రబాబు దీన్ని నిరసించాడు. టీడీపీ నేతలు ఆందోళన చేశారు. కానీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిన జనసేనాని విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతు తెలిపారు. ఓవైపు ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని మరో వైపు ఆ పార్టీ వ్యతిరేకించిన విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడమేంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. బీజేపీతో పవన్ విడిపోతున్నారంటే అదీ స్పష్టత లేదు. అయినా ఎవరి లోపాయికారి రాజకీయాలు వారివి..

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి చాలా ఆలస్యంగా రంగంలోకి దిగి వారికి మద్దతుగా బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఓకే బాగానే ఉంది. ఈ సభకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సభలో విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తున్న కేంద్రాన్ని.. బీజేపీ సర్కార్ ను పవన్ అస్సలు ప్రశ్నించలేదు. కానీ ఏపీ ప్రభుత్వం.. అధికార వైసీపీపై మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడడమే ఇప్పుడు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

విశాఖ ఉక్కుపై వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందని పవన్ విమర్శించారు. ఏపీలో బంద్ చేసి ఢిల్లీలో మద్దతిస్తారని.. వైసీపీ సర్కార్ దీనికి సహకరిస్తోందని పవన్ విమర్శించారు. ఏపీ ప్రభుత్వానిదే తప్పు అని తేల్చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైసీపీ సర్కార్ ఏం చేస్తుందో చెప్పాలని వారం రోజులు డెడ్ లైన్ పెట్టేశారు..

విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం ఆపమన్నా కూడా వినకుండా తనకిష్టం వచ్చినట్టుగా చేస్తోంది. కానీ కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ వెనకేసుకు వచ్చినట్టుగా మాట్లాడారు. మన పోరాటం చేయకుండా కేంద్రాన్ని అనడం తనకిష్టం లేదన్నారు. అవ్వా పెట్టదు.. అడుక్కుతిననివ్వదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడేశారు. ఈ ప్రసంగంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్న కేంద్రాన్ని అనకుండా వైసీపీ ప్రభుత్వాన్నే పూర్తిగా దోషిగా నిలబట్టేలా పవన్ మాట్లాడినట్టుగా స్పష్టమైంది.

ఇక తన ప్రసంగంలో టీడీపీ ప్రభుత్వాన్ని సైతం పవన్ ప్రశంసించడం భవిష్యత్ రాజకీయాలను సూచిస్తోంది. క్రమంగా పవన్ టీడీపీకి దగ్గరవుతున్నారా? అన్న సందేహాలు కలుగకమానదు. తాను పోరాటం చేస్తే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను నాడు టీడీపీ ప్రభుత్వం ఆపేసిందని.. కానీ వైసీపీ సర్కార్ మాత్రం చేయడం లేదని ఆక్షేపించారు. ఇలా పవన్ కళ్యాణ్ ‘విశాఖ ఉక్కు పోరాటం’ ఫక్తు వైసీపీ సర్కార్ టార్గెట్ గానే సాగింది. ఉక్కును ప్రైవేటీకరిస్తున్న కేంద్రాన్ని ఏమీ అనక.. ప్రతిపక్షాన్ని పొగిడేసి.. అసలు దీంతో సంబంధం లేని వైసీపీ సర్కార్ ను ఆడిపోసుకోవడం కనిపించింది.