
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ విష వాయువుతో వందలమంది ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.. ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కరోనాతో సహజీవనం చేయాలని గతంలో ఏపీ సీఎం జగన్ చెప్పిన మాటను గుర్తుచేస్తూ.. ఈ స్టైరీన్ విష వాయువుతో కూడా సహజీవనం చేయాలా?అని ఏపీ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు పరిహారం ఇచ్చారు సరే.. పరిష్కారం ఎప్పుడు? అని నిలదీశారు. దైన్యంగా మిగిలిన బాధితులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కరోనాతో కలిసి జీవించే పరిస్థితి తప్పదని చెబుతున్న ప్రభుత్వం.. స్టైరీన్ మృత్యువాయువుతో సైతం సహజీనం చేయాల్సిందేనని తన చర్యల ద్వారా ప్రభుత్వం చెప్పకనే చెబుతోందని పవన్ ఎద్దేవాచేశారు. పారిశ్రామిక వృద్ధి ముఖ్యమే అని, అదే సమయంలో ప్రజల ప్రాణాలు కూడా అంతకంటే ముఖ్యమని పవన్ అన్నారు.
పారిశ్రామికాభివృద్ధి పర్యావరణ హితంగా, ప్రజల జీవన విధానం మెరుగుపడే విధంగా ఉండాలన్నారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను చూసి నిపుణులు సైతం నివ్వెరపోతున్నారని దుయ్యబట్టారు.