Pawan Kalyan
Pawan Kalyan: వారాహి మూడో విడత యాత్ర విశాఖలో చురుగ్గా సాగుతోంది. అందులో భాగంగా పెందుర్తిలో ఇటీవల వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను ఇళ్లలోకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. దండుపాళ్యం బ్యాచ్ కు వాలంటీర్లకు తేడా లేదని విమర్శించారు.
ఒంటరిగా వృద్ధురాలు ఉండడం చూసి వాలంటీర్ ఈ ఘటనకు దిగాడని.. బంగారం కోసం కిరాతకానికి పాల్పడ్డాడని పవన్ మండి పడ్డారు. ఇలాంటి పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదన్నారు. బాధిత కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించకపోవడం దారుణం అన్నారు. వారి మనస్తత్వాన్ని తెలియజేస్తుందని మండిపడ్డారు ఇలాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ… వైసీపీ కార్యకర్తల కోసమే సమాంతరంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని పవన్ ఆరోపించారు.
అసలు వాలంటీర్ నియామక ప్రక్రియ ఏ ప్రాతిపదికన చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్ పోర్ట్ కావాలన్నా.. పోలీస్ వెరిఫికేషన్ చేస్తున్నారని.. మరి వాలంటీర్ వ్యవస్థకు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. నవరత్నాల కోసం పెట్టుకున్న వ్యవస్థ.. ప్రజల ప్రాణాలు తీస్తుంటే పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
ఏపీలో మనుషుల అదృశ్యం ఎక్కువ గా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే జరుగుతోందని పవన్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర నుంచి 150 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని.. ఏపీ నుంచి హ్యూమన్ ట్రాఫిక్ జరుగుతోందని నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యర్థి తనకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తుందని చెప్పడం లేదని.. వ్యవస్థలు సక్రమంగా పనిచేసుకునేలా మాత్రం చేస్తామని పవన్ ప్రకటించారు.