Pawan Kalyan vs Jagan : ఆర్థిక నిపుణులు అప్పును రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి మంచి అప్పు. రెండోది చెడు అప్పు. మంచి అప్పు ఆదాయాన్ని సృష్టిస్తే.. చెడు అప్పు వడ్డీలను పెంచుతూ నెత్తిన భారంగా మారుతుంది. అది కుటుంబానికైనా సరే.. రాష్ట్రానికైనా సరే. ఇక్కడ అప్పును మనం ఏ విధంగా ఉపయోగించామన్నదే ముఖ్యం. అప్పును సంపదను సృష్టించడానికి కాకుండా.. కేవలం పథకాల అమలు కోసం ఉపయోగిస్తే.. రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితే.
ఇప్పుడు అప్పుల గురించి ఇంత మాట్లాడుకోవడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కార్టూనే కారణం. ఏపీ సీఎం జగన్ చేస్తున్న అప్పుల పై సెటైరికల్ గా ఉన్న కార్టూన్ షేర్ చేశారు. జగన్ కు `అప్పురత్న` అవార్డు వచ్చినట్టుగా .. అధికారులు ఓ మెమొంటోను తెచ్చి జగన్ కు ఇస్తున్నట్టుగా కార్టూన్ లో ఉంది. అది సోషల్ మీడియాలో షేర్ చేశారు. పక్కన ఉన్న మరో అధికారి ` ఇది భారతరత్న అవార్డు లాంటి గొప్పది` అని చెబుతున్నట్టు కార్టూన్ లో ఉంది. ఈ కార్టూన్ మహా సెటైరికల్ గా ఉందని చెప్పవచ్చు. ఏపీ అప్పులు పరిమితికి మించాయని లెక్కలు విడుదలయిన నేపథ్యంలో జనసేనాని ఇలాంటి కార్టూన్ షేర్ చేయడం ఆసక్తిగా మారింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ. 55,555 కోట్ల అప్పులు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అప్పులను కేవలం పథకాల అమలు కోసమే చేస్తున్నారు. ఎక్కడా సంపద సృష్టి జరగలేదు. అభివృద్ధీ జరగలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ` అప్పురత్న` కార్టూన్ షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “ మీ వ్యక్తిగత ఆస్తులను పెంచుకునే విషయం మరిచిపోవద్దు. అదే సమయంలో రాష్ట్ర ప్రజల ఆస్తులు కుక్కలకు వదిలేయాలి. కానీ మీ వ్యక్తిగత ఆస్తులు భద్రంగా చూసుకోవాలి “ అంటూ ఆవేశంతో కూడిన సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.
అప్పు రత్న సెటైరికల్ కార్టూన్ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గీయించినట్టు తెలుస్తోంది. ఏపీలో అప్పుల పరిమితి దాటిపోయింది. కేంద్రం విధించిన పరిమితికి లోబడి ఏ రాష్ట్రమైనా అప్పులు చేయాలి. కానీ ఏపీ ఆ పరిమితిని ఎప్పుడో దాటిపోయింది. ఇంకా అప్పులు చేస్తూనే ఉంది. పప్పులు బెల్లాల్లా ప్రజలకు పంచిపెడుతూనే ఉంది. సంక్షేమ పథకాల అమలును ఎవరూ కాదనరు. పేదవర్గాలకు సంక్షేమ పథకాలు అవసరమే. కానీ ఆ సంక్షేమ పథకాలు అప్పుల నుంచి కాకుండా.. ఆదాయం సృష్టించి ఇవ్వాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుంది.
అప్పుల తీసుకొచ్చి ఆదాయం సృష్టించే పని ఏపీ ప్రభుత్వం చేయడంలేదు. కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే వెచ్చిస్తోంది. ఆదాయం సృష్టించగలిగితే .. ఆ అప్పుకు వడ్డీ కట్టగలం. కానీ అప్పును పంచి పెడితే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ?. అప్పుకు వడ్డీ ఎలా కడతారు? . రాష్ట్రం చేసిన అప్పుల భారం రాష్ట్ర ప్రజలే కదా మోయాల్సింది. మళ్లీ పన్నుల రూపంలో చెల్లించాల్సిందే కదా. ఇక ప్రభుత్వం ఇస్తున్న ఉచిత పథకాలకు విలువ ఏముంటుంది అన్న విషయం అధికారంలోని నేతలు ఆలోచించాలి.
తాను చేస్తున్నది తప్పని తెలియని అమాయకుడేం కాదు జగన్ రెడ్డి. ఆయనే పెద్ద పెట్టుబడిదారుడు. ఆయనకు అప్పులు ఎలా చేయాలో తెలుసు. ఎలా తీర్చాలో తెలుసు. ఆదాయం ఎలా సృష్టించాలో కూడా తెలుసు. కానీ ఏపీ ఆయన సొంత ఆస్తి కాదు. ఏపీ ప్రజలు ఆయన సొంత బంధువులు కాదు. అలాంటప్పుడు ఆయన సొంత ఆస్తుల్లాగా ఏపీ ప్రజల ఆస్తులను ఎందుకు కాపాడుతారు ?. ఏపీ ఆదాయం ఎందుకు పెంచాలని చూస్తారు ? ఆయనకు కేవలం ఓట్లు మాత్రమే కావాలి. అందుకు అవసరమైన పని మాత్రమే చేస్తారు. అంతకు మించి ఆయన చేయరు. అందుకే అప్పులు మాత్రమే చేస్తున్నారు.