Pawan Kalyan CM Candidate: బీజేపీ మదిలో ఏముంది? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి జనసేనను మాత్రమే ఎందుకు పిలిచినట్టు? టీడీపీని పిలుస్తారా? లేకుంటే పవన్ తో సరిపెడతారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. పవన్ ను ప్రత్యేకంగా పిలవడం వెనుక ఏదో ఒక అజెండా ఉంటుంది. అది బీజేపీ, జనసేన కలిసి నడవడమేనా? లేకుంటే అంతకు మించి ఏదైనా ఉందా? అయితే ఒకటి మాత్రం చెప్పగలం. జగన్, చంద్రబాబులకు ధీటుగా పవన్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికేనన్న టాక్ నడుస్తోంది. అందుకే పవన్ సైతం ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఒక రోజు ముందే ఢిల్లీ చేరుకోనున్నారు.
ఇందులో పవన్ కోరుకుంటున్న రూట్ మ్యాప్ తో పాటు స్పష్టమైన సందేశాన్ని బీజేపీ పెద్దలు ఇచ్చే అవకాశాలున్నాయి. ఏపీలో బీజేపీ, జనసేనలు ఎదగాలి. అందుకు సంబంధించి ఎక్కువగా దిశా నిర్దేశం చేసే అవకాశముంది. 2024 ఎన్నికలకు పట్టుమని పది నెలలు కూడా లేకపోవడంతో ఉమ్మడి కార్యాచరణ దిశగా సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా టీడీపీ వద్ద ఉన్న ఓటు బ్యాంకు క్రమేపీ బీజేపీ, జనసేనల వైపు మళ్లాలన్నదే హైకమాండ్ పెద్దల అభిలాష. అందుకే టీడీపీని పక్కన పెట్టి పవన్ ను మాత్రమే సమావేశానికి పిలవడం వెనుక అతిపెద్ద వ్యూహం అదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో ఇప్పుడు రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రజలు విసుగుచెంది ఒక పార్టీని పక్కన పెట్టి మరో పార్టీని గెలిపిస్తున్నారు. ఆ రెండు పార్టీలు తప్పితే మూడో పార్టీకి చాన్స్ లేదు. పవన్ రూపంలో జనసేన తెరపైకి వచ్చినా ప్రత్యామ్నాయ స్థానాన్ని భర్తీ చేయలేకపోతోంది. అందుకే పవన్ కు రాజకీయ అండదండలు కల్పించి పవర్ లోకి వచ్చే ఆలోచనలో కాషాయదళం ఉంది. అందుకు అవసరమైతే పవన్ ను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించిన ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ముందున్న ఆప్షన్లలో అంతకు మించి తరుణోపాయం లేదని తెలుస్తోంది.
వైసీపీది స్టాండర్డ్ ఓటు బ్యాంకు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. వారిని కదిలించడం చాలా కష్టం. అదే టీడీపీ విషయానికి వస్తే అగ్రవర్ణాలతో పాటు బీసీలు వెన్నుదన్నుగా ఉన్నారు. పైగా ఇప్పటికే కాపులు పవన్ వైపు టర్న్ అయ్యారు. కమ్మలు సైతం బీజేపీకి కాస్తా అనుకూలమే. ఫస్ట్ ప్రయారిటీగా టీడీపీని చూస్తూనే.. బీజేపీని సైతం ఆదరిస్తున్నారు. అందుకే ముందుగా టీడీపీని నిర్వీర్యం చేస్తే ఆ ఓటు బ్యాంకు అంతా బీజేపీ, జనసేన వైపు కన్వర్టవుతారన్నది హైకమాండ్ పెద్దల ఆలోచన. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఏపీ అని ప్రకటన చేసి వార్ ప్రకటించిన పవన్ బీజేపీ పెద్దల ప్రతిపాదన విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.