K. A. Paul: కేఏ పాల్ శపించాడు: ఆదాని షేర్లు పడిపోయాయి.. ఇది కామెడీ కాదు సీరియస్ మేటర్

సీరియస్ గా సాగుతున్న వ్యవహారంలో నవ్వులు పూయించాలంటే అంత సులభమైన విషయం కాదు. పైగా ఆ సమయంలో నవ్విస్తే వీడికి ఏమైనా పిచ్చా అని అనుకుంటారు.

Written By: K.R, Updated On : May 3, 2023 10:08 pm
Follow us on

K. A. Paul: రాజకీయాలంటే పరస్పరం విమర్శలు చేసుకోవడమేనా, పోలీసులతో దాడులు చేయించుకోవడమేనా, నువ్వు ఇంత తిన్నావంటే, నువ్వు అంత తిన్నావని దూషించుకోవడమేనా.. కాదు కాదు అస్సలు కాదు.. రాజకీయమంటే ఎదుటివారిని నవ్వించడం, మీమ్స్ క్రియేటర్స్ కు చేతినిండా పని కల్పించడం, యూట్యూబ్ థంబ్ నైల్స్ లాగా మారిపోవడం, సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా నిల్వడం. ఇది ఎలా చేయాలో కేఏ పాల్ కు తెలిసినంత మరెవరికీ తెలియదు.

కామెడీ ఆయన వల్లే సాధ్యం

సీరియస్ గా సాగుతున్న వ్యవహారంలో నవ్వులు పూయించాలంటే అంత సులభమైన విషయం కాదు. పైగా ఆ సమయంలో నవ్విస్తే వీడికి ఏమైనా పిచ్చా? అని అనుకుంటారు. కానీ ఇలాంటప్పుడు కామెడీ చేయడం కేఏ పాల్ కు మాత్రమే సాధ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ మీద చర్చ నడుస్తోంది. ఇది హిందూజా గ్రూప్ న కు కట్టబెట్టారని ప్రచారం జరుగుతోంది. అంతకు ముందు జరిగిన బిడ్ ప్రక్రియలో సింగరేణి పాల్గొంటుందని కేసీఆర్ ప్రకటించారు. నమస్తే వీర లెవల్లో డప్పు కొట్టింది. కానీ చివరికి అది ఆర్భాటమే అయింది. అయితే దీనిని కేసీఆర్ రాజకీయ ఎత్తుగడగా తెలుసుకోలేకపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆకాశానికి ఎత్తేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడే దమ్ము చంద్రశేఖర రావుకు మాత్రమే ఉందనే రేంజ్ లో ట్వీట్ చేశారు. తర్వాత కెసిఆర్ అసలు రూపం తెలిసి సైలెంట్ అయిపోయారు..

పతనం వెనుక ఉన్నది కేఏ పాల్?

ఈ వ్యవహారంలో లేటుగా ఎంటర్ అయినప్పటికీ కెఏ పాల్ తనదైన శైలిలో కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. తనను ముఖ్యమంత్రిని చేస్తే ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారుస్తానని ప్రకటించారు. అంతేకాదు తాను గతంలో ఏపీకి వేలాది కోట్లు పెట్టుబడులు తెచ్చానని వెల్లడించాడు. అంతే కాదు అదాన అడ్డగోలుగా సంపాదిస్తున్నాడని, తనకు తిక్క రేగి శపిస్తే గౌతమ్ ఆదానీ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయిందని బాంబు పేల్చాడు.. ఇన్నాళ్లు గౌతమ్ ఆదాని గ్రూపు హిండెన్ బర్గ్ నివేదిక వల్ల నష్టపోయిందని చాలామంది అనుకున్నారు.. మీడియా కూడా అదే విషయాన్ని పదేపదే చెప్పింది. ఇన్నాళ్లకు గాని తెలియదు దాని వెనుక కేఏ పాల్ ఉన్నాడని. చదువుతుంటే నవ్వొస్తుంది కదా.. రాజకీయాల్లో పరస్పర విమర్శలు మాత్రమే కాదు.. ఇలాంటి నవ్వులు పూయించే క్యారెక్టర్ కూడా ఉండాలి.. జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా! ఇక న్యూస్ ఛానల్స్ అయితే ఇలాంటి వాటితో పండగ చేసుకుంటాయి.

ఇప్పుడు ఇలా అయిపోయాడు కానీ..

అన్నట్టు కేఏ పాల్ ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ… ఒకప్పుడు లక్షలాది మందితో సమావేశాలు నిర్వహించేవాడు. క్రైస్తవ మత బోధకుడిగా ప్రపంచవ్యాప్తంగా తిరిగేవాడు. అమెరికా అధ్యక్షుడిని నేరుగా కలిసేవాడు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి పన్నాగంలో పావు అయిపోయాడు. చివరకి కామెడీ పీస్ గా మిగిలిపోయాడు.. ప్రజాశాంతి పార్టీలో కపోతంలాగా తిరుగుతున్నాడు కానీ… కేఏ పాల్ ను ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు? మీడియా, సోషల్ మీడియా తప్ప.