ISI conspiracy In India Exposed: భారత్ ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్లోని ఐఎస్ఐ కొత్త పంథాలో మన దేశంలో విధ్వంసానికి కుట్రలు చేస్తోంది. దేశంలోని నిరుద్యోగులు, పేదలను ఉపయోగించుకుని మన రహస్యాలను సేకరిస్తోంది. ఇప్పటికే ఇలాంటి వారిని ఎన్ఐఏ గుర్తించింది. తాజాగా గాజియాబాద్లో తీగ లాగితే భారీ ఐఎస్ఐ కుట్ర బయటపడింది. గాజియాబాద్లో కానిస్టేబుల్ వినేష్ విధులు నిర్వహిస్తుండగా, ముగ్గురు యువకులు రకరకాల పరికరాలతో కనిపించారు. వారిని ఆపి విచారించగా, ఆ పరికరాలు సీసీ కెమెరాలని, వాటిని ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేశారని తెలిసింది. ఫోన్లో చూడగా మిలటరీ వాహనాల కదలికలు, విమానాల ల్యాండింగ్–టేకాఫ్ వివరాలు కనిపించాయి. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ఫాస్ట్ ఫుడ్ యజమాని నుంచి ఐఎస్ఐ ఏజెంట్ వరకు
పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ కుట్రకు సూత్రధారి సోహైల్ అనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని అని తెలిసింది. ఉత్తరప్రదేశ్లో ఉద్యోగం చేసిన అతను, పాకిస్తాన్లోని ఐఎస్ఐకి సీసీటీవీ వీడియోలు పంపిస్తున్నట్లు అంగీకరించాడు. ఢిల్లీ కంటోన్మెంట్, సోనీపట్ రైల్వే స్టేషన్, ఆర్మీ డిపోల వద్ద కెమెరాలు బిగించినట్లు వెల్లడించాడు. సోహైల్ ఫోన్లోని డేటాను సేకరించబోగా, అది సెల్ఫ్–డిస్ట్రక్ట్ అయి మాయమైంది. ఫ్లైట్ మోడ్లో డేటా తీయగా, జాతీయ భద్రతకు సంబంధించిన గోప్య సమాచారం బయటపడింది. అతను ముంబైలోని మీరా పేరు చెప్పగా, ఆమె సంబల్లోని మరో యువతిని పేర్కొంది. వీరంతా ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు అంగీకరించారు.
కొత్త తరహా కుట్ర..
ఈ కుట్రలో భాగంగా రాత్రి 1 నుంచి 2 గంటల మధ్య సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. రైల్వే స్టేషన్ల ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి స్థానిక విద్యుత్ సరఫరాపై ఆధారపడకుండా సోలార్ ప్యానెల్స్తో నడుస్తున్నాయి. భారత ప్రభుత్వ సబ్సిడీతో ఈ సోలార్ వ్యవస్థలు బిగిస్తున్నాయి. 12 రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ విజయవాడ, హైదరాబాద్లో ఈ నెట్వర్క్ ఉంది.
మహిళల రాడికలైజేషన్..
మహిళల గ్రూపును తయారు చేసి, వారిని రాడికలైజ్ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలు బిగిస్తున్నవారంతా కూలీలు, డబ్బుల కోసం ఈ పని చేశారు. కుట్రతో వీరికి నేరుగా సంబంధం లేదు. హిందువులను వాడుకుని ఐఎస్ఐ భారత్పై కుట్ర పన్నుతోంది.
యోగి ప్రభుత్వం చర్యలు..
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాంతిభద్రతల కోసం గాజియాబాద్లోనే 2 వేలకు పైగా పోలీస్ బీట్లు ఏర్పాటు చేసింది. ఈ గ్రూపులు ఉగ్రవాద, అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తున్నాయి. వినేష్ చాకచక్యంతో ఈ భారీ కుట్ర బయటపడింది. ప్రస్తుతం పోలీసులు మహ్మద్/సర్దార్ అనే ముఖ్య సూత్రధారి కోసం గాలిస్తున్నారు. అతను ఓ మొబైల్ నంబర్ కలిగి ఉండి, సోహైల్, మహెక్లతో తరచుగా మాట్లాడేవాడు.
ఈ ఘటన భారత జాతీయ భద్రతా వ్యవస్థలో లోపాలను బయటపెట్టింది. సరిహద్దు దాటి ఉగ్రవాద నెట్వర్క్లు ఎలా పనిచేస్తున్నాయో అర్థమైంది. పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి, 23 మందిని విచారిస్తున్నారు. ఈ కుట్ర బయటపడటం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.