కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం దేశం అంతటా లాక్డౌన్ పాటిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని స్తంభింప చేసి, కేవలం అత్యవసర సేవలపైననే కేంద్రీకరిస్తున్నారు. లాక్డౌన్ సమయాన్ని ఇంకా కొనసాగించాలని దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.
అయితే రాజధాని అమరావతి రీజియన్ లో మాత్రం లాక్డౌన్ అమలులో లేదా అన్న సందేశాలు వ్యక్తం అవుతున్నాయి. వంద రోజులకు పైగా మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళలు, కరోనా కారణంగా ఇళ్లలోనే దీక్షలు జరుపుతున్నారు.
అయితే వారిని వేధించి, అమరావతి ఉనికినే లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా అక్కడి ప్రజలను వేధించడం మానకపోవడం విస్మయం కలిగిస్తుంది. లాక్డౌన్ అమలులో ఉన్న అధికారులే పట్టించుకొనక పోవడం గమనార్హం.
మంగళవారం నీరుకొండ, ఐనవోలులో…, బుధవారం మందడంలో సీఆర్డీఏ అధికారులు పర్యటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్లోని ఆర్5 రెసిడెన్షియల్ జోన్పై ప్రజాభిప్రాయసేకరణకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని అధికారులు చెప్పడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందుకు ఇదా సమయం అని నిలదీశారు. కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిప్రాయాలను స్కైప్ ద్వారా తెలియజేయాలని చెబుతున్నారు. ఈ సమయంలో వారి రాక అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ఈ సందర్భంగా రెండు గంటల పాటు వాగ్వివాదం జరిగిన తర్వాత అధికారులు వెనుతిరిగారు.
లాక్డౌన్ ఉన్న సమయంలో సీఆర్డీఏ అధికారులు అభిప్రాయ సేకరణకు రావడం చట్టరీత్యా నేరమని రైతులు స్పష్టం చేస్తున్నారు. సీఆర్డీఏ అధికారుల తీరును, వారి పేరు, ఐడీ తదితర వివరాలను వీడియో రికార్డు చేశారు. కేంద్ర హోం శాఖ సెక్రటరీకి వీడియోలను పంపాలని రైతులు, జేఏసీ నేతలు తీర్మానించారు. అలాగే సీఆర్డీఏ కమిషనర్కు పరిస్థితిపై సమాచారం అందించాలని నిర్ణయించారు.
అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న మహిళలపై ఫేస్బుక్ వేదికగా అసభ్యపదజాలంతో పోస్టులు సృష్టించి వేధించడం మరోవంక జరుగుతున్నది. ఆ విధంగా మహిళలను తీవ్రంగా అవమానించిన ఘటనలో వర్రా రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేశామని సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక తెలిపారు.
మహిళలను అసభ్యపదజాలంతో అవమానించిన వారు జైలుకు వెళ్లకతప్పదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలోగానీ, ప్రత్యక్షంగా గానీ మహిళల విషయంలో ఎవరైనా పరిధులు దా టి వ్యవహరిస్తే వారికి జైలు శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు.