https://oktelugu.com/

NIA Raids In Hyderabad: హైదరాబాద్ నగరంలో ఉగ్ర కదలికలు.. ఎన్ఐఏ సోదాల్లో ఏం బయటపడిందంటే..

హైదరాబాద్‌లో మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు కలకలం సృష్టించాయి. శనివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి.

Written By: , Updated On : September 17, 2023 / 01:06 PM IST
NIA Raids In Hyderabad

NIA Raids In Hyderabad

Follow us on

NIA Raids In Hyderabad: ఒకప్పుడు దేశంలో ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా.. దాని మూలాలు హైదరాబాదులో కనిపించేవి. మక్కా మసీదు బాంబ్ బ్లాస్ట్, గోకుల్ చాట్, లుంబిని పార్క్ లో బాంబు పేలుళ్ల సంఘటనలు హైదరాబాద్ నగరానికి మాయని మచ్చగా మిగిలాయి. అదే గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో ఉగ్ర జాడలు తగ్గుముఖం పట్టాయి. అయితే గత కొద్ది నెలలుగా దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఉగ్ర ఆనవాళ్లు కనిపించాయి. దీనికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టగా.. దానికి సంబంధించిన కీలక ఆధారాలు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నట్టు స్పష్టం చేశాయి.ఈ క్రమంలోనే జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు హైదరాబాద్ మహానగరంలో అత్యంత గోప్యంగా విచారణ చేపడుతున్నారు. నిన్న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు ప్రాంతంలో ఏకకాలంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో హైదరాబాద్ మహానగరంలోనూ విస్తుతంగా సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

చర్చనీయాంశమైన సోదాలు

హైదరాబాద్‌లో మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు కలకలం సృష్టించాయి. శనివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. హైదరాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోపాటు ఇతర రాజకీయ ప్రముఖుల పర్యటనల సమయంలో సోదాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. గత ఏడాది అక్టోబరులో కోయంబత్తూరు కారు బాంబు కేసు దర్యాప్తు లో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌సహా తమిళనాడులోని 31ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ పాతనగరం, సైదాబాద్‌, టోలిచౌకిలోని ఐదు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ప్ర త్యేక బృందాలు దాడులు జరిపాయి. సైదాబాద్‌లోని అమీన్‌కాలనీలో దాడులు జరిపిన అధికారులకు విస్మయకర వాస్తవాలు తెలిసాయని ప్రచారం జరుగుతుంది.

అదుపులో ఓ ముస్లిం యువకుడు

మహమ్మద్‌ నూరుల్లా అనే బిల్డర్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని సోదరుడు, అడ్వొకేట్‌ వికార్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. రెండు దక్షిణాది రాష్ట్రాల్లో తనిఖీల్లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ.. శనివారం నాటి సోదాల్లో రూ.60 లక్షల నగదు, 18,200 అమెరికన్‌ డాలర్లు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్ లు, హార్డ్‌డిస్క్ లు ఇతర కీలక ప త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అరబిక్‌ తరగతుల ముసుగులో ఓ వర్గం యువతను విధ్వంసంవైపు ఆకర్షించి, దాడులకు కుట్ర చేస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు ఆధారాలను సేకరించారు. విధ్వంసకర దృశ్యాలను సోషల్‌ మీడియా, చానళ్లలో విస్తృతంగా ప్రచా రం చేసి.. ఓ వర్గం యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షితుల్ని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాలతోపాటు కోయంబత్తూరులో 22ప్రాంతాలు, చెన్నైలో మూడు, కడయనల్లూర్‌లోని ఒక ప్రదేశంలో ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాలు సో దాలు నిర్వహించాయి. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నాయి. అదుపులోకి తీసుకున్న వారు ఐఎస్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు అనే ఆధారాలు లభించాయని అధికారులు పేర్కొన్నారు.