Nalin Prabhat: తీవ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించేలా.. కాశ్మీర్‌లో గండరగండరుడిని దించిన మోదీ సర్కార్‌

కశ్మీర్‌ ఈ పేరు వినగానే అందమైన మంచు కొడలు.. సరస్సులు ఆహ్లాదపరిచే ప్రకృతి సౌందర్య గుర్తొస్తుంది. తర్వాత ఉగ్రదాడులు.. బాంబుల మోతలు, ఎన్‌కౌంటర్లు గుర్తొస్తాయి. కశ్మీర్‌ లేని భారత్‌ను ఊహించలేం.

Written By: Raj Shekar, Updated On : August 17, 2024 4:01 pm

Nalin Prabhat

Follow us on

Nalin Prabhat: జమ్మూ కశ్మీర్‌.. దాదాపు 70 ఏళ్లు ఆర్టికల్‌ 370 కారణంగా ప్రత్యేక ప్రతిపత్తితో, ప్రత్యేక రాజ్యాంగంతో ఉంది. భారత దేశంలో భాగం అయినప్పుడు ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకు అన్న ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం లేదు. దేశ విభజన సమయంలో నాటి ప్రధాని నెహ్రూ జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో 1950 నుంచి జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 అమలవుతూ వచ్చింది. అయితే మోదీ ప్రధాని అయ్యాక వ్యూహాత్మకంగా ఆర్టికల్‌ 370 రద్దు చేశారు. అదే సమయంలో జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర హోదాను రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. దీని తర్వాత దాదాపు ఎన్నికలు నిర్వహించలేదు. ఇటీవలే ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో అక్కడి అధికారులను బదిలీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది. ఉగ్రదాడులకూ ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో ఉగ్రదాడులను అల్లర్లను నియంత్రించే పోలీస్‌ అధికారులను నియమిస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్కు కొత్త డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నళిన్‌ ప్రభాత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హెూంశాఖ కేబినెట్‌ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ కశ్మీర్లో డీజీపీగా ఆర్‌ఆర్‌ స్మైన్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవీకాలం సెప్టెంబర్‌ 30 ముగియనుంది. స్మైన్‌ 1991 బ్యాచ్‌కు చెందిన జమ్మూకశ్మీర్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి. 11 నెలలపాటు డీజీపీగా సేవలు అందించారు. ఈ తర్వాత పదవీ విరమణ చేయనున్నారు.

కొత్త డీజీపీగా ఆంధ్రా క్యాడర్‌ ఆఫీసర్‌
ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ప్రభాత్‌. అయితే ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌–గోవా–మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతం కేడర్‌కు అతడిని డిప్యుటేషన్‌ను కేంద్రం ఆమోదించింది. ప్రస్తుతం నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌కి అధిపతిగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్‌ 30 వరకు జమ్మూ కాశ్మీర్లో స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్‌ఓడీజీ)గా నియమితులయ్యారు. అక్టోబర్‌ 12 డీజీపీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్దరించడం, అసెంబ్లీ ఎన్నికలు సైతం ప్రశాంతంగా నిర్వహించేందుకు నళిన్‌ ప్రభాత్‌ను జమ్మూ కశ్మీర్కు కేంద్రం పంపిందనే ఓ చర్చ సైతం కొనసాగుతుంది.

స్వరాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌..
నళిన్‌ ప్రభాత్‌ స్వరాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌. 1968లో మనాలిలో జన్మించిన నళిన్‌ ప్రభాత్‌.. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ ఎంఏ చేశారు. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిగా ఎన్నికైన ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పనిచేశారు. కరీంనగర్, కడప, వరంగల్‌ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వాటిని ఎదుర్కోవడంలో ఆయన చూపిన తెగువ, చొరవకు ప్రశంసలతో పాటుగా అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి.మూడు పోలీసు గ్యాలెంట్రీ మెడల్స్‌తో సహా అనేక గౌరవాలను అందుకున్నారు. పరాక్రమ్‌ పతక్‌(విశిష్ట సేవా పతకం), ఆంత్రిక్‌ సురక్ష పతకం సహా అనేక మెడల్స్‌ అందుకున్నారు. 2004 నుంచి కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతూ వచ్చారు. మొదట కొన్నాళ్లు నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌లో పనిచేసిన ఆయన, ఆ తర్వాత ఇండో–టిబెటన్‌ పోలీస్‌ ఫోర్స్‌ 14వ బెటాలియన్‌(శ్రీనగర్‌), 21వ బెటాలియన్‌(శ్రీనగర్‌), 16వ బెటాలియన్‌(లడఖ్‌)లకు కమాండెంట్‌గా పనిచేశారు. తర్వాత సీఆర్పీఎఫ్‌ సౌత్‌ కాశ్మీర్‌ ఆపరేషన్‌ రేంజ్‌ డీఐజీగా మూడేళ్లపాటు పనిచేసిన ఆయన, కొన్నాళ్లు చండీగఢ్‌ రేంజ్, బస్తర్‌ ఆపరేషన్స్‌ రేంజ్లో డీఐజీగా పనిచేశారు. 2010 డిసెంబర్‌ నుంచి రెండేళ్ల పాటు సీఆర్పీఎఫ్‌ ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, జమ్ము–కాశ్మీర్‌ జోన్, శ్రీనగర్‌ సెక్టార్లలో సేవలందించారు. ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా కాశ్మీర్‌ ఆపరేషన్స్‌ సెక్టార్కు నేతృత్వం వహించారు. సుదీర్ఘకాలం జమ్ము–కాశ్మీర్‌ రాష్ట్రంలో వివిధ కేంద్ర పారామిలటరీ బలగాల్లో వివిధ హెూదాల్లో పనిచేసిన ఆయనకు ఈ ప్రాంతంపై సమగ్ర అవగాహన, పట్టు ఉంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఇదే ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కూడా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఏరికోరి జమ్ము– కాశ్మీర్‌ డీజీపీగా నియమించింది.