ఏపీ పోలీస్ పై ఎంపీ రఘురామ గురి..!

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్నేహితుడు నలంద కిషోర్ మృతి చెందడం రాజకీయంగా కలకలం రేపింది. ఆయన గుండెపోటులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏపీ పోలీసుల వేదింపుల వల్లే నలంద కిషోర్ చనిపోయారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపిస్తున్నారు. నలంద కిషోర్ పేరు నిన్నటి వరకూ పెద్దగా తెలిసిన పేరు కాదు. అయితే సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ లకు వ్యతిరేకంగా వచ్చిన పోస్టును ఆయన షేర్ చేయడంతో సిఐడి […]

Written By: Neelambaram, Updated On : July 25, 2020 8:52 pm
Follow us on


మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్నేహితుడు నలంద కిషోర్ మృతి చెందడం రాజకీయంగా కలకలం రేపింది. ఆయన గుండెపోటులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏపీ పోలీసుల వేదింపుల వల్లే నలంద కిషోర్ చనిపోయారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపిస్తున్నారు. నలంద కిషోర్ పేరు నిన్నటి వరకూ పెద్దగా తెలిసిన పేరు కాదు. అయితే సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ లకు వ్యతిరేకంగా వచ్చిన పోస్టును ఆయన షేర్ చేయడంతో సిఐడి అధికారులు అతనని అరెస్టు చేశారు. విశాఖ నుంచి కర్నూలు తరలించి అక్కడ విచారించి వదిలి పెట్టారు. నలంద కిషోర్ అరెస్టుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.. పోలీసుల తీరును తప్పుబట్టారు.

Also Read: ఓట్లు లేవు.. పార్టీకి నేతల పోట్లు మాత్రం ఉన్నాయి

సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయి విడుదలైన నలంద కిషోర్ మృతి రాజకీయ అంశంగా మారిపోయింది. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ అంశం దొరికినా వదిలిపెట్టని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కిషోర్ మృతిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికితోడు ఏపీ పోలీసులపై అసంతృప్తితో ఉన్న ఆయనకు ఈ అంశంలో అటు ప్రభుత్వంపైనా, ఇటు పోలీసులపైనా గురిపెట్టేదిగా ఉండటంతో వెంటనే రంగంలోకి దిగిపోయారు. అనారోగ్యంగా ఉన్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోకుండా విశాఖ నుంచి కర్నూలుకు తరలించారని తెలిపారు. కిషోర్ షేర్ చేసిన పోస్టులో ఎవరి పేరు లేదని, అయినా పోలీసులు అయనను అరెస్టు చేయడం, కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కర్నూలుకు తరలించి అక్కడ వదిలి పెట్టడం దారుణమన్నారు.

Also Read: ఆ రాష్ట్రానికి కరోనా తలవంచనుందా?

మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం ఈ వ్యవహారంపై స్పందించలేదు. త్వరలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకోవడమే ఇందుకు కారణం కావచ్చు. ఇదిలా ఉండగా నలంద కిషోర్ కు కరోనా టెస్టులో పాజిటివ్ వచ్చిందని పరీక్ష నిర్వహించిన వైద్యులు చెబుతున్నారు. కరోనా కారణంగానే కిషోర్ మృతి చెంది ఉండవచ్చనే అనుమానం వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అనారోగ్యంతో మృతి చెందారని కుటుంబ సభ్యులు చెప్పడం విశేషం. దీంతో కిషోర్ మృతిపై మిస్టరీ కోనసాగుతుంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం గాని, పోలీసులు గాని స్పందించలేదు.