Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ డేంజర్‌ బెల్స్‌.. మూడుకు పెరిగిన కేసులు.. మరో కరోనా తప్పదా?

ఎక్కడో ఆఫ్రికాలో పుట్టిన మంకీపాక్స్‌ వైరస్‌ ఇప్పుడు భారత్‌లో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. 2019లో చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పుడు మంకీపాక్స్‌ భయపెడుతోంది.

Written By: Raj Shekar, Updated On : September 28, 2024 3:35 pm

Monkeypox

Follow us on

Monkeypox:  ఎక్కడో ఆఫ్రికాలో పుట్టిన మంకీపాక్స్‌(ఎంపాక్స్‌)వైరస్‌ ఆఫ్రికాలోని అనేక దేశాలను అతలాకుతలం చేసింది. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌తో అనేక మంది దానిబారిన పడ్డారు. ఆస్పత్రులపాలయ్యారు. అదృష్టం ఏమిటంటే.. ఎంపాక్స్‌ మరణాలు తక్కువగా ఉన్నాయి. మందు లేకపోయినా లక్షణాల ఆధారంగా ఇచ్చే చికిత్సతో కోలుకుంటున్నారు. ఇక ఎంపాక్స్‌కు వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక ఆఫ్రికాలో పుట్టిన ఎంపాక్స్‌.. ఇప్పుడు భారతీయులను భయపెడుతోంది. నెల రోజుల వ్యవధిలోనే భారత్‌లో ఎంపాక్స్‌ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఇండియాలో మూడు పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. శుక్రవారం (సెప్టెంబర్‌ 27న) మరో కేసు వెలుగు చూసింది. దీంతో కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి తాజాగా ఎంపాక్స్‌ బారిన పడ్డాడు. ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి రక్త నమూనాలు పరీక్షలకు పంపించగా, ఎంపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉంది. నిపుణుల పర్యవేక్షణలో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు.

సెప్టెంబర్‌ 9న తొలి కేసు..
ఆఫ్రికాను భయపెడుతున్న మంకీపాక్స్‌ తొలి కేసు భారత్‌లో సెప్టెంబర్‌ 9 ఢిల్లీలో వెలుగు చూసింది. రక్త నమూనాలు పరీక్షించి పశ్చిమ ఆఫ్రికాలో వ్యాపిస్తున్న క్లేడ్‌–2గా నిర్ధారించారు. ఇక సెప్టెంబర్‌ 18న దుబాయ్‌ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం(సెప్టెంబర్‌ 27న) మరో కేసు కేరళలోనే నమోదైంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చేవారిలో ఎవరికైనా మంకీపాక్స్‌ లక్షణాలు ఉంటే.. సమాచారం ఇవ్వాలని కోరింది.

99 వేల కేసులు..
ఇదిలా ఉంటే.. మంకీ పాక్స్‌ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. 122 దేశాల్లో 99 వేల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆఫ్రికా దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇక మంకీపాక్స్‌ సోకిన రోగి సపోర్టివ్‌ మేనేజ్‌మెంట్‌తో కోలుకుంటున్నాడు. దీంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

చికిత్స ఇలా..
ఎంపాక్స్‌ చాలా సందర్భాలలో దానంతటదే తగ్గుతుంది. కానీ కొందరు ఇది తీవ్రంగా ఉంటుందని, ఇప్పటికే ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ లేదు. సూచించిన మందులు వాడాలి. రోగికి ఉన్న లక్షణాలను బట్టే చికిత్స చేస్తారు. దీంతో ఆందోళన వద్దని వైద్యులు కూడా సూచిస్తున్నారు. వైరస్‌ పెరిగితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.