Modi Vs Mamata: సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేసుకుంటారు. అధికార పార్టీ అభ్యర్థులు తాము చేసిన అభివృద్ధి గురించి చెబుతుంటారు. ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల జరుగుతాయి. మనదేశంలో రాజ్యాంగంలో రూపొందించిన నిబంధన. ఐదు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో గెలుపు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. దీనికోసం రకరకాల ప్రచారాలు.. రాజకీయాలు చేస్తుంటాయి. ఇందులో ఈ పార్టీ ఎక్కువ.. ఆ పార్టీ తక్కువ అని చెప్పుకోవడానికి లేదు. ఎవరి వ్యూహాలు వారికుంటాయి. ఎవరి ప్రణాళికలు వారు అమలు చేస్తారు.
ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రంజు మీద ఉంది. ఇక్కడ మమత బెనర్జీ ఆధ్వర్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆమె కొన్ని సంవత్సరాలుగా బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. బలమైన క్యాడర్.. అంతకు మించిన కార్యకర్తల బలాన్ని ఆమె పెంపొందించుకున్నారు. అందువల్లే కొంతకాలంగా బెంగాల్ రాష్ట్రంలో స్థిరమైన పరిపాలన సాగిస్తున్నారు. కమ్యూనిస్టులకు కంచుకోట లాగా ఉన్న బెంగాల్ రాష్ట్రాన్ని తన సొంతం చేసుకొని.. మమత ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నారు.
బెంగాల్ రాష్ట్రంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చూపించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించింది. అంతేకాదు మమతా బెనర్జీని బిజెపి అభ్యర్థి ఓడించారు. ఆ తదుపరి జరిగిన ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలించారు.. మమతా బెనర్జీ నాయకత్వంలో బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ కార్యకర్తలు దుర్మార్గాలకు పాల్పడ్డట్టు.. అక్రమాలకు నాంది పలికినట్టు వార్తలు వచ్చాయి. అయితే వీటిని మమతా బెనర్జీ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. ఇదంతా బీజేపీ చేసిన కుట్ర అని ఆమె మండిపడుతున్నారు.
ఇప్పుడిక బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రచారం జోరం అందుకుంది. సాధారణంగా ఎన్నికల ప్రచారం.. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అభివృద్ధి, అవినీతి ఆరోపణల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి బెంగాల్ రాష్ట్రంలో మాత్రం ఎన్నికల ప్రచారం చేపల చుట్టూ పరిభ్రమిస్తోంది. ఎందుకంటే బెంగాల్ రాష్ట్రంలో చేపల వినియోగం ఎక్కువగా ఉంటుంది. వినియోగానికి తగ్గట్టుగా ఇక్కడ ఉత్పత్తి ఉండదు. ప్రజల అవసరాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి చేపలను దిగుమతి చేసుకుంటారు. అయితే ఇదే విషయాన్ని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. మమత నాయకత్వంలో కనీసం బెంగాల్ ప్రజలకు తమ సొంత రాష్ట్రంలో ఉత్పత్తి అయిన చేపలను తినే భాగ్యం లేకుండా పోయిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే చేపలను ఉత్పత్తి చేసే ప్రాంతంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని రూపొందిస్తామని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు.
నరేంద్ర మోడీ చేపల గురించి మాట్లాడిన తర్వాత ఆయన కు కౌంటర్ ఇచ్చారు మమత బెనర్జీ. బెంగాల్ ప్రజల ఆహారపు అలవాట్ల మీద నరేంద్ర మోడీ దెబ్బ కొడుతున్నారని.. చేపలు తినడాన్ని దుష్ట సంప్రదాయంగా చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజల ఆహారపు అలవాట్ల మీద ఆంక్షలు పెట్టడం నరేంద్ర మోడీకి అలవాటని ఆమె చెబుతున్నారు. అయితే మమత వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు కూడా స్పందించారు. బెంగాల్ ప్రజల ఆహారపు అలవాట్లమీద తాము ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం లేదని.. ఆంక్షలు విధించే అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు మార్కెట్లలో చేపలను పట్టుకుని బిజెపి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేస్తుండడం విశేషం.