Minister Peddireddy Ramachandra Reddy: ఏపీలో సీఎం పోస్ట్ ఖాళీగా ఉందా? జగన్ తప్పించి మరో నేతను ఎన్నుకుంటారా?మీరు విన్నది నిజమే. ఏకంగా ఓ సీనియర్ మంత్రి సీఎంను మారుస్తామని ప్రకటించడం నివ్వెర పరుస్తోంది. ఇలా ప్రకటించినది సాదాసీదా నాయకుడు కాకపోవడం కాస్త అనుమానానికి తావిచ్చింది. కానీ ఆయన మాట తడబడ్డారు. పొరపాటున అలా ప్రకటించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వైసీపీలో వై నాట్ కుప్పం అన్న నినాదం ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం ఆ నినాదానికి బీజం వేసింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం నుంచి ఎలాగైనా ఓడించాలన్నది ధ్యేయం.. ఆ బాధ్యతను జగన్ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పచెప్పారు. తరచూ కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటిస్తూ వస్తున్నారు. శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ నాయకుడు భరత్ కు ఎమ్మెల్సీ పదవి అప్పగించి ప్రోత్సహించారు. నియోజకవర్గంలో వైసిపి సమన్వయ బాధ్యతలు అప్పగించారు.
భరత్ వినూత్న కార్యక్రమాలతో నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం మండలంలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. వెండుగంపల్లిలో పర్యటించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ భరత్ ను కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే తేరుకున్న పెద్దిరెడ్డి పొరపాటును గ్రహించారు. జరిగిన తప్పిదాన్ని మన్నించాలని కోరారు. దీంతో అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి