Gudivada Amarnath
Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్ లోలోపల రగిలిపోతున్నారా? హై కమాండ్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారా? పైకి మాత్రం గుంభనంగా కనిపిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఏకంగా కార్యకర్తల సమావేశంలో గుడివాడ అమర్నాథ్ కన్నీటి పర్యంతం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని చెప్పుకొచ్చిన ఆయన.. తనను అనకాపల్లి నుంచి తప్పించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయన తప్పించినా వేరేచోట ఇంతవరకు నియమించలేదు.
రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అభ్యర్థులను మార్చుతూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తొలి జాబితాలో 11 మందిని మార్చిన సీఎం జగన్..రెండో జాబితాలో 27 మందిని మార్చారు. అందులో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి ఉంది. అక్కడ మలసాల భరత్ కుమార్ ను ఇన్చార్జిగా నియమించారు. కానీ అమర్నాథ్ ను మాత్రం గాలిలో ఉంచారు. ఏ నియోజకవర్గ కేటాయించకపోవడం విశేషం. అప్పటినుంచి అమర్నాథ్ తీవ్ర మనస్థాపంతో ఉన్నారు. మీడియా ముందుకు రావడం కూడా మానేశారు. అంతకు ముందు రోజే మార్పులను సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత రోజే అనకాపల్లికి కొత్త ఇన్చార్జిని నియమించారు. కానీ తనను మాత్రం విస్మరించడంతో అమర్నాథ్ బాధతో ఉన్నారు.
అనకాపల్లి వైసీపీ కార్యాలయంలో కొత్త నియోజకవర్గ ఇన్చార్జ్ భరత్ కుమార్ పరిచయ వేదిక నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అమర్నాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. అనకాపల్లి నియోజకవర్గ వీడి వెళుతున్నందుకు బాధగా ఉందంటూ కంటతడి పెట్టుకున్నారు. మిమ్మల్ని వీడి బాధతో వెళుతున్న.. మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. నాకు టికెట్ దక్కలేదని కొన్ని పత్రికలు, చానల్లో రాస్తున్నాయి. అమర్ పనైపోయింది అంటూ ప్రచారం చేస్తున్నాయి. చిన్న వయసు నుండి కష్టాలు చూసిన వాడిని. ఇలాంటి వార్తలు వల్ల నేను కుంగిపోను. వైసీపీలో అన్నిటికంటే పెద్ద పదవి ఒకటి ఉంది. అది వైసీపీ కార్యకర్త పోస్ట్. అది ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు. నీతో పాటు కార్యకర్తగా జండా మోయడానికి సిద్ధంగా ఉన్న. వీధుల్లో కార్యకర్తగా తరగతా. వైసీపీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం. అధికారంలోకి వచ్చాక కొంతమందికే పదవులు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాళ్లు పార్టీలో ఉండడం కంటే వెళ్లడమే మంచిది. నా రాజకీయ జీవితం సంతృప్తిగా ఉంది. గతంలో చంద్రబాబు కొడుకు అనుభవించిన పదవి నాకు జగన్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి భరత్ సహకరించాలి అని కార్యకర్తలకు సూచించారు.
తనకు ఈ పరిస్థితి వస్తుందని గుడివాడ అమర్నాథ్ అస్సలు ఊహించలేదు. ఒకవేళ మార్పు అనివార్యమైనా.. తనకు వేరే నియోజకవర్గం అప్పగిస్తారని నమ్మకంగా ఉండేవారు. కానీ తనను మార్చిన ఎక్కడా కొత్త నియోజకవర్గం కేటాయించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తన స్థాయికి మించి దూకుడు ప్రదర్శించడంతో.. రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అమర్నాథ్ భావిస్తున్నారు. అధినేత జగన్ కు ఎక్కువగా నమ్మి మోసపోయానని ఇప్పుడు బాధ పడిపోతున్నారు. చిన్న వయసులో మంత్రి పదవి దక్కేసరికి మోతాదుకు మించి జగన్ విషయంలో గుడివాడ అమర్నాథ్ భక్తి ప్రదర్శించారు. అదే ఇప్పుడు వికటించిందని.. ఇబ్బందులు తెచ్చి పెట్టిందని అసలు వాస్తవాన్ని అమర్నాథ్ గ్రహిస్తున్నారు. అందుకే ముందు రోజు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని మరి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అందుకే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతారు.