Minister Ambati Rambabu
Minister Ambati Rambabu: రాయలసీమలో పర్యటిస్తున్న చంద్రబాబు జగన్ సర్కారును ఏకిపారేస్తున్నారు. జగన్ హయాంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు దారుణంగా అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు.అయితే దీనికి కౌంటర్ ఇవ్వాల్సిన మంత్రి అంబటి రాంబాబు సినిమా కబుర్లతో కాలం వెళ్లదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై పడి ఏడుస్తున్నారు.దీంతో అంబటి రాంబాబు తీరుపై వైసీపీ నుంచే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తనను నమ్ముకున్న వాళ్లకి మంత్రి పదవులు ఇచ్చారే తప్ప .. వారి నుంచి జగన్ కు ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకుండా పోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శనను రాయలసీమ నుంచే ప్రారంభించారు. మొదటిరోజు నంద్యాల జిల్లాలోని ప్రాజెక్టులను సందర్శించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమలో తాగు, సాగునీటి అందించేందుకు తన హయాంలో ఎన్నో పనులు చేశానని గుర్తు చేశారు. సీమ ద్రోహి జగన్ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. అయితే దీనిపై సంబంధిత శాఖ మంత్రిగా అంబటి రాంబాబు కౌంటర్ ఇవ్వాలి. కానీ ఆయన అవన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం నివ్వెరపరుస్తోంది.
సాధారణంగా అంబటి మీడియా ముందుకు వస్తే పవన్ ని హైలెట్ చేస్తారు. ఆయనపై వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యమిస్తారు. మూడు పెళ్లిళ్ల ముచ్చట తీసుకొస్తారు. రెండు రోజుల కింద ఇలానే మీడియం ముందుకు వచ్చారు. బ్రో సినిమాలో తనపై ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి వెటకరించడాన్ని మండిపడ్డారు. అంతటితో ఆ ఎపిసోడ్ ను ముగింపు పలకకుండా పదేపదే మీడియా ముందుకు వస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులపై గణాంకాలతో సహా విమర్శల వర్షం కురిస్తున్నారు. దానిపై కౌంటర్ ఇవ్వకుండా అడ్డదిడ్డంగా మాట్లాడి అడ్డంగా బుక్ అవుతున్నారు.
అయితే సాగునీటి ప్రాజెక్టులపై అంబటికి కనీస పరిజ్ఞానం లేదని సెటైర్లు పడుతున్నాయి. అదే పవన్ మూడు పెళ్లిళ్లు, బ్రో సినిమాలో శ్యాం బాబు పాత్రల కోసమైతే ఎంచక్కా మాట్లాడేస్తున్నారు. ఇలాంటి వాటితో వైసీపీ సర్కార్ కు ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరి ఈ విషయం అంబటి రాంబాబు ఎప్పుడు తెలుసుకుంటారో మరి. ఒక విధంగా చెప్పాలంటే డమ్మీ క్యాబినెట్ తో చంద్రబాబు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆ ఆట అంబటితోనే ప్రారంభించారు.