Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలు.. అమెరికాలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

నాలుగు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా రెండు అంశాల మీద చేసిన వ్యాఖ్యలు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేశాయి. మొదటిది వారసత్వ పన్నుపై చేసిన వ్యాఖ్య, రెండవది దక్షిణాదివారి రంగుకు సంబంధించిన విశ్లేషణ.

Written By: Raj Shekar, Updated On : September 10, 2024 3:59 pm

Rahul Gandhi(3)

Follow us on

Rahul Gandhi: దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరిగి నాలుగు నెలలు కావస్తోంది. వరుసగా మూడోసారి మోదీ ప్రధాని పదవి చేపట్టి.. తొలి ప్రధాని పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును సమయం చేశారు. ఈసారి ఎలాగైనా ఎన్డీఏను గద్దె దించాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే బీజేపీ మెజారిటీని మాత్రం తగ్గించగలిగింది. 2019 ఎన్నికల్లో 303 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి 230 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే.. ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల తర్వాత కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత పార్లమెంటు ఎన్నికలపై అమెరికాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు న్యాయంగా జరిగినట్టు తాను విశ్వసించడం లేదని పేర్కొన్నారు. బీజేపీకి 240 సీట్లలోపు వచ్చుంటే నేను ఆశ్చర్యపోయేవాడిన్నారు. వారికి అర్థబలం చాలా ఎక్కువ. వారు కోరుకున్నట్టే ఈసీ పనిచేసిందని ఆరోపించారు. తన అజెండాకు తగిన విధంగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు మోదీకి అవకాశం దొరికిందన్నారు.

వరుస సమావేశాలు..
మూడు రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన రాహుల్‌గాంధీ అక్కడ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. వర్జీనియాలో ప్రవాస భారతీయులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల నాటి పరిస్థితులపైనా మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌ బ్యాంక్‌ అకౌంట్లను ఐటీ శాఖ ఫ్రీజ్‌ చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల వేళ తమ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్‌ చేసి.. తమ నాయకులకు నిధులు ఇవ్వకుండా చేశారని పేర్కొన్నారు. దాని వల్ల కాంగ్రెస్‌ నేతలు ఒక్కసారిగా విశ్వాసం కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. కానీ వారిలో ధైర్యం నింపి ఎన్నికలకు వెళ్లినట్లు తెలిపారు. అలాగే.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇప్పుడు బీజేపీని చూసి ఎవరూ భయపడడం లేదని, ఇప్పుడు తాను కూడా ప్రధాని ముందుకు వెళ్లి 56 అంగుళాల ఛాతి ఇక చరిత్రే అని చెప్పగలనంటూ వ్యాఖ్యానించారు. మొత్తంగా అమెరికాలో పర్యటనలో రాహుల్‌ రిజర్వేషన్ల రద్దుతోపాటు పలు అంశాలపై వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు ఫైర్‌ అవుతున్నారు. రాహుల్‌ వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నారు.

రిజర్వేషన్లపై..
ఇదే క్రమంలో ఆయన రిజర్వేషన్ల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్టాత్మక జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు. భారత్‌లో ప్రస్తుతం ఆదివాసీలు, దళితులు, ఓబీసీల రిజర్వేషన్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. వారికి సరైన రిజర్వేషన్లు అందడం లేదని, ప్రాధాన్యత సైతం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధిలోనూ వారి భాగస్వామ్యం నామమాత్రమేనని చెప్పారు. దేశంలో అన్నివర్గాల వారికి పారదర్శకంగా అవకాశాలు దొరికినప్పుడే తాము రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తామని చెప్పారు. కామన్‌ సివిల్‌ కోడ్‌ గురించి ప్రశ్నించగా.. దాని గురించి తాను ఇప్పుడే స్పందించే పరిస్థితి లేదన్నారు.