Mahavir Jayanti 2026 date: ఈ ఏడాది మహావీర్ జయంతిపై కన్ఫ్యూజన్ నెలకొంది. మార్చి 30న జరుపుకోవాలా? 31 జరుపుకోవాలా అని జైనులు సందేహిస్తున్నారు. అయితే ఈ ఏడాది మార్చి 31న జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది 2,623వ జయంతి జరుపనున్నారు. తిథి ప్రకారం చూస్తే మార్చి 30న ఉదయం 7:09 గంటలకు త్రయోదశి ప్రారంభం అవుతుంది. మార్చి 31 ఉదయం 6:55 గంటల వరకు ఉంటుంది. శనిత్రయోదశి ముగిసిన మరుసటి రోజు మహావీర్ జయంతి జరుపుకుంటారు. అందుకే అధికారిక తేదీ మార్చి 31.
పూజా సమయాలు..
మార్చి 31న ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య స్నానాలు చేసి దానాలు చేయాలి. ఉదయం 7:09 నుంచి 10:30 వరకు పూజలు చేసుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య రథయాత్రి నిర్వహించాలి. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య హారతి, భజనలు నిర్వహించాలి.
వర్థమానుడి నుంచి మహావీరుడిగా
క్రీస్తుపూర్వం 599లో బీహార్లోని కుండలగ్రామం (ప్రస్తుతం వైశాలి జిల్లా)లో రాజు సిద్ధార్థ, రాణి త్రిశల దంపతులకు వర్థమానుడు జన్మించారు. ఇతను ఇక్షాకు వంశానికి చెందిన క్షత్రియ కుటుంబంలో పుట్టారు. 30వ ఏట రాజ్యాన్ని, సంపదను త్యజించి, సన్యాసం స్వీకరించారు. 12 ఏళ్ల కఠోర తపస్సు, ధ్యానం చేశారు. 42వ ఏట సర్వజ్ఞానం పొందారు, అప్పుడు మహావీరుడు (మహా యోధుడు) అయ్యారు. తర్వాత 30 ఏళ్లు దేశమంతా పర్యటించారు. జైన తత్వాన్ని బోధించారు. 72వ ఏటా క్రీస్తు పూర్వం 527లో మోక్షం పొందారు.
Also Read: పదునెక్కిన భారత బ్రహాస్త్రం.. పాకిస్తాన్, చైనా గుండెలు దడదడ!
పంచ మహావ్రతాలు
మహావీరుడు పంచ సూత్రాలను బోధించారు. ఇవి జైనులకు చాలా పవిత్రమైనవి. ప్రాణి హింస చేయకూడదు. మాట, మనసు, శరీరంతో హింస కూడా తప్పే. నిజం మాత్రమే మాట్లాడాలి. దొంగతనం చేయకూడదు. ఇంద్రియ నిగ్రహం, పవిత్రత పాటించాలి. వస్తు సంగ్రహణ వదులుకోవాలి అని బోధించారు. ఈ ఐదు సూత్రాలు జైన మతానికి పునాదిగా నిలిచాయి, నేటికీ కోట్లాది మంది జైనులకు మార్గదర్శకాలుగా ఉన్నాయి.
ఎక్కడ జరుపుకుంటారు?
మహావీర్ జయంతిని దేశంలోని రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్, ఉదయ్పూర్, జైసల్మేర్, గుజరాత్లోని పాలితానా, శ్రీ శంఖేశ్వర్లో, మహారాష్ట్రలోని ముంబై, పుణె, కోల్హాపూర్లో, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, శ్రావణబెళగొళ, మధ్యప్రదేశ్లోని ఖజురహో, గ్వాలియర్, బీహార్లోని రాజ్గీర్, పాట్నా, వైశాలి (జన్మ స్థలం)లో ఎక్కువగా జరుపుకుంటారు. నేపాల్, అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్లోనూ జైన సమాజాలు ఉన్న ప్రాంతాల్లో జయంతి వేడుకలు జరుపుకుంటారు.
మహావీర్ జయంతి కేవలం ఒక పండగ కాదు. అది అంతర్లీన శాంతి, అహింస, సత్యం వైపు అడుగు వేసే రోజు. 2624 సంవత్సరాల తర్వాత కూడా మహావీరుడి సందేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచి ఉంది.