Padayatra: పాదయాత్రలే.. పార్టీకి ప్రాణపోస్తాయా..‘రోడ్డు’న పడుతున్న నేతలు

Padayatra: తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రే విజయయాత్రగా మారింది. నాడు పదేళ్ల టీడీపీ పాలనకు ‘వైఎస్ఆర్’ నడుం కట్టి రాష్ట్రమంతటా తిరిగి తన చిరకాల వాంఛ నెరవేర్చుకున్నాడు. కాంగ్రెస్ ను పదేళ్ల పాటు అధికారంలో ఉంచాడు. ఆ తర్వాత చంద్రబాబు ఇదే పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ఇక ఆ తర్వాత జగన్ వంతు.. ఏకంగా 3వేల పైచిలుకు కిలోమీటర్లు నడిచి ఏపీలో అఖండ విజయం సాధించాడు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ‘పాదయాత్ర’ పవర్ ఫుల్ యాత్రగా […]

Written By: NARESH, Updated On : April 16, 2022 11:37 am
Follow us on

Padayatra: తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రే విజయయాత్రగా మారింది. నాడు పదేళ్ల టీడీపీ పాలనకు ‘వైఎస్ఆర్’ నడుం కట్టి రాష్ట్రమంతటా తిరిగి తన చిరకాల వాంఛ నెరవేర్చుకున్నాడు. కాంగ్రెస్ ను పదేళ్ల పాటు అధికారంలో ఉంచాడు. ఆ తర్వాత చంద్రబాబు ఇదే పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ఇక ఆ తర్వాత జగన్ వంతు.. ఏకంగా 3వేల పైచిలుకు కిలోమీటర్లు నడిచి ఏపీలో అఖండ విజయం సాధించాడు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ‘పాదయాత్ర’ పవర్ ఫుల్ యాత్రగా మారింది. తెలంగాణ నేతలంతా ఈ ఎండాకాలం పూట చమటలు కక్కుతూ రాష్ట్రమంతా తిరిగేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Bandi Sanjay

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ముందస్తు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయ పార్టీల నాయకుల పాదయాత్రలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రారంభించి విరామం ప్రకటించిన పాదయాత్రలు పునఃప్రారంభమయ్యాయి. మరికొందరు కొత్తగా యాత్రలు షురూ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు తద్వారా ఓటర్ల మన్ననలు పొందేందుకు పాదయాత్రలు దోహదం చేస్తాయని నాయకులు భావిస్తున్నారు.

Also Read: Vijayasai Reddy Vs Bandla Ganesh: జ‌నం నిన్ను చెప్పుతో కొడ‌తారు.. మా కులాన్నే తిడ‌తావా.. సాయిరెడ్డిపై రెచ్చిపోయిన బండ్ల‌..

-బహుజన రాజ్యాధికార యాత్ర

R. S. Praveen Kumar

మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ చేరికతో తెలంగాణలో బహుజన సమాజ్‌ పార్టీలో ఉత్సాహం కనబడుతోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ప్రవీణ్‌కుమార్‌ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. బీఎస్‌పీ తెలంగాణ చీఫ్‌ కోఆర్డినేటర్‌ హోదాలో ఆయన ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌ నుంచి మార్చి 6న ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 300 రోజులు 5 వేల గ్రామాల మీదుగా ఈ యాత్ర సాగనుంది.

-భట్టి.. పీపుల్స్‌ మార్చ్‌

bhatti vikramarka

కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క.. మధిర నియోజకవర్గంలో ‘పీపుల్స్‌ మార్చ్‌’ పేరుతో ఫిబ్రవరి 27న పాదయాత్ర చేపట్టారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి నుంచి పాదయాత్ర చేపట్టి 200 కిలోమీటర్లు పూర్తి చేశారు. తన అసెంబ్లీ సెగ్మెంట్‌లో 32 రోజులపాటు 500 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని భావించినప్పటికీ.. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో 100 కిలోమీటర్లు యాత్ర చేసి తాత్కాలిక విరామం ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో మళ్లీ యాత్ర ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన యాత్రం మధిర నియోజకవర్గంలో కనొసాగుతోంది.

-ఆమ్‌ ఆద్మీ పార్టీ పాదయాత్ర

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న మరికొంత నేతలు కూడా పాదయాత్ర మొదలు పెట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ నేతలతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్టు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సెర్చ్‌ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరా శోభన్ గతంలో తెలిపారు. అయితే పంజాబ్‌లో ‘ఆప్‌’ ఘన విజయం ఆ పార్టీ నాయకులు, కేడర్‌లో ఉత్సాహం నింపింది. దీంతో ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 14న పాదయాత్ర హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ నుంచి మొదలు పెట్టారు. అయితే ఈ యాత్ర ఎన్నిరోజులు, ఎక్కడి వరకు సాగుతుందనే విషయమై నేతలు స్పష్టత ఇవ్వలేదు.

-పునఃప్రారంభమైన ‘ప్రజా సంగ్రామ యాత్ర’

Bandi Sanjay

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఈనెల 14న జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రారంభమైంది. ఆలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అనంతరం సభ నిర్వహించి యాత్ర షురూ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు, ఇతర అంశాలు తెలుసుకుని ఎన్నికల మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దాలని ఆయన భావిస్తున్నారు. మే 31 వరకు ఈ యాత్ర సాగనుంది.

-ప్రజాప్రస్థానం పున:ప్రారంభం
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను మార్చి 11 నుంచి పునః ప్రారంభించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని కొండపాకగూడెం నుంచి పాదయాత్ర పునఃప్రారంభమైంది. ప్రతీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, నియోజకవర్గంలోని సగానికిపైగా మండలాల్లో కొనసాగేలా పాదయాత్రకు రూపకల్పన చేశారు. గతేడాది అక్టోబర్‌ 20న ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించిన షర్మిల… ఎమ్మెల్సీ కోడ్‌తోపాటు కరోనా మూడో వేవ్‌ కారణంగా యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. మార్చి 11న తిరిగి ప్రారంభించారు.

-త్వరలో కాంగ్రెస్‌ కూడా..

revanth reddy

ఇప్పటికే పలు పార్టీలు తెలంగాణలో పాదయాత్రలు మొదలు పెట్టిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని భావిస్తున్న జాతీయ పార్టీ కాంగ్రెస్‌ కూడా పాదయాత్ర చేపట్టాలని భావిస్తోంది. అయితే అంతర్గత విభేదాలతో ఎవరు యాత్ర చేయాలనేది మాత్రం స్పష్తత లేదు. మే 6, 7వ తేదీలో రాష్ట్రానికి రాహుల్‌గాంధీ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన తర్వాత అధిష్టానం అనుమతితో పాదయాత్ర చేపట్టాలని నాయకులు భావిస్తున్నారు. పాదయాత్ర ద్వారా పార్టీ మైలేజ్‌ కంటే సొంత మైలేజీ పెంచుకునేందుకు ఎక్కువ మంది ఆలోచిస్తున్నట్లు సొంతపార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు, స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర రేసులో ముందువరుసలో ఉన్నారు. వీరికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డి వ్యతిరేక నాయకులు పోటీ ఇస్తున్నారు. ఎవరికి వారు యాత్రకు అనుమతి కోసం అధిష్టానాన్ని కోరాలని భావిస్తున్నారు.

-అందరి లక్ష్యం అధికారమే..
తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్న అన్ని పార్టీల నాయకుల లక్ష్యం అధికారమే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పాదయాత్ర దోహదపడతాయని భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశలో పాదయాత్ర చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర, బస్సు యాత్రతో ఓటర్లను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చారు. 2017లో పాదయాత్ర చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ మినహా అన్ని పార్టీల నాయకులు యాత్ర మొదలు పెట్టారు. మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో.. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే.

Also Read:Joe Biden: జోబైడెన్ మతి గతి తప్పిందా?వైరల్ అవుతున్న బైడెన్ వింత చేష్టలు

Tags