ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతానికి కేటాయింపునకు మించి నీటిని వినియోగించుకున్నందున పలు ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగం నిలిపివేయాలని కృష్ణా బోర్డు ఆదేశించింది. సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం లేఖ రాశారు. మే నెల వరకు చేసిన కేటాయింపుల కన్నా ఎక్కువ నీటిని వాడుకున్నారని లేఖలో బోర్డు పేర్కొంది. నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులను విధిగా పాటించాలని బోర్డు ప్రభుత్వానికి సూచించింది. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని బోర్డు స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వానికి సాగర్ కుడి కాల్వ ద్వారా 158.255 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటికే 158.264 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 47.173 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటి వరకు 48.328 టీఎంసీల నీటిని వినియోగించినట్లు తెలిపింది.
రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకూ తాగునీటి అవసరాల కోసం మిగిలిన నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని బోర్డు అభిప్రాయం వ్యక్తం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేటాయింపులకు మించి జలాలను తీసుకున్నందున ఆయా కాల్వల ద్వారా నీటి విడుదలను ప్రస్తుతానికి నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలు వాడుకున్న జలాలు, అందుబాటులో ఉన్న నీటి వివరాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖలో పేర్కొంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బోర్డు చర్యలు చేపట్టింది.
మరోవైపు తెలంగాణా ప్రభుత్వం కృష్ణా నదిపై అనుమతి చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు సమర్పించాలని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. పోతిరెడ్డిపాడుపై తన వాదనలు వినిపించిన సమయంలో కృష్ణా నదిపై తెలంగాణా ప్రభుత్వం అనుమతులు లేకుండా ఐదు ప్రాజెక్టును నిర్మించినట్లు ఏపీ అధికారులు పిర్యాదు చేశారు. దీంతో ఈ పాలమూరు-రంగారెడ్డి, దిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల, ప్రాజెక్టుల డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్)లు, కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్టుల సామర్ధ్యం పెంపుపై పిర్యాదులు అందడంతో వాటి వివరాలతో హాజరు కావాలని తెలంగాణా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. గతంలోనే ఈ ప్రాజెక్టుల వివరాలు అందజేయాలని ఆదేశించినా నేటివరకూ అందజేయలేదని తెలిపింది. ఏ పర్యాయం ఇచ్చిన గడువులోగా వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది.