Komuraiah : తెలంగాణలో రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల స్థానానికి ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది. మూడు స్థానాల ఓట్ల లెక్కింపును మార్చి 3న(సోమవారం) ప్రారంభించారు. నల్గొండ–ఖమ్మం–వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్రెడ్డి(Sreepal Reddy( విజయం సాధించారు. రెండో ప్రాధన్యత ఓట్ల లెకికంపుతో ఫలితం తేలింది. ఇక కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గం కమలం వశమైంది. ముందు నుంచీ అనుకున్నట్లుగా మల్క కొమురయ్య(Malka Komuraiah) ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తొలిప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం విశేషం. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యాయి. 897 చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్రెడ్డికి 7,182, అశోక్కుమార్కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాను బీజేపీ అభ్యర్థి కొమురయ్య చేరుకున్నారు. దీంతో తొలిరౌండ్లోనే బీజేపీ(BJP)మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలిచినట్లయింది. గతంలో పీఆర్టీయూ బలపరిచిన కూర రఘోత్తంరెడ్డి(Raghottam Reddy) విజయం సాధించగా, ఈసారి టీచర్ సంఘాలు కాకుండా జాతీయ పార్టీ బీజేపీ పోటీ చేసి గెలవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..
బండి అభినందనలు
రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు. ఇది మామూలు విజయం కాదు. 5,900 ఓట్ల తేడాతో మల్క కొమురయ్య భారీ విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల నమ్మకం, భరోసా ఉంది. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారు..’ అని అన్నారు.
కలిసి వచ్చిన 317 జీవో పోరాటం..
ఇదిలా ఉంటే.. కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోపై అప్పటల్లో ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తీవ్ర పోరాటం చేశారు. ఇంట్లో దీక్ష చేపట్టగా పోలీసులు ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ అరెస్ట్ చేశారు. ఇందులో పలువురు కార్యకర్తలు కూడా లాఠీ దెబ్బలు తిన్నారు. అప్పటి నుంచే టీచర్ల బీజేపీపై, ముఖ్యంగా బండి సంజయ్పై విశ్వాసం పెరిగింది. ఆ ప్రభావం తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ వడబోత..
సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్(Graduate) ఓట్ల వడపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన ఎన్నికల లెక్కింపు, చెల్లని, చెల్లిన ఓటర్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో రకరకాల ప్రచారాలు మొదలవడంతో రాత్రి ప్రకటించారు. అప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా అందులో 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మిగిలిన 1.50 లక్షల ఓట్ల వడబోత మంగళవారం(Tuesday)మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం లెక్కింపు మొదలైనా.. తొలి ప్రాధాన్యంలో కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అందులో కోటా ఓట్లు చేరుకునే వరకు ఎలిమినేషన్ రౌండ్లు కొనసాగుతాయి.
Also Read : రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనలో బీజేపీ భారీ స్కెచ్.. చివరివరకూ సస్పెన్సే